లీకులు ఇస్తూ.. కాదంటూ: చంద్రబాబు దారిలో కాంగ్రెస్!?
కాంగ్రెసు పార్టీ అనేక క్లిష్ట అంశాల పైన లీక్ రాజకీయాలకు తెరలేపుతోందంటున్నారు. ఇటీవల రాష్ట్ర పరిణామాలను చూస్తే ఆ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. విభజన అంశంలో అధికార పార్టీ ఎన్నో లీక్లు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చుతారనే లీకులు కూడా వచ్చాయని చెబుతున్నారు.
కిరణ్ను మార్చుతామని, తెలంగాణ విషయంలో రాయల తెలంగాణ, హైదరాబాదుతో కూడిన తెలంగాణ, ఇలా పలు మార్గాలతో పాటు హైదరాబాదును ఏం చేయాలనే అంశం పైనా లీకులు ఇచ్చారంటున్నారు.
అధిష్టానం లీకులు ఇచ్చి అవి తమకు సానుకూలంగా లేనప్పుడు వాటిని ఖండిస్తున్నారంటున్నారు. ఇటీవల కిరణ్ మార్పుపై జోరుగా ప్రచారం సాగింది. సమన్వయ కమిటీలో కిరణ్ను మార్చుతారని చాలామంది భావించారు. అయితే దీనిపై సీమాంధ్ర నేతల నుండి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో దానిని ఆ తర్వాత ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు డిగ్గీ ఖండించారు.
అంతకుముందు కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కిరణ్ స్థానంలో ఆయనకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి.
ఢిల్లీ పెద్దలు లీకులు ఇచ్చి వాటి పట్ల ప్రజల నుండి, నాయకుల నుండి వచ్చే ప్రతిస్పందనను బట్టి ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో క్లిష్టమైన అంశాల పైన ఇలాంటి పద్ధతే పాటించే వారంటున్నారు.