నిప్పులా బతికాను, పొత్తులపై త్వరలో నిర్ణయం: బాబు
హైదరాబాద్: పదేళ్ల కాంగ్రెసు పాలనలో తనకు అనేక ఇబ్బందులు కల్పించారని, అయితే తాను నిప్పులా బతికానని, దాంతో ఏమీ చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ప్రస్తుతం నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయని, ఇది విచిత్రమైన పరిస్థితి అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కార్యకర్తలకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
తమ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. న్యాయవాదులను విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెసు పాలనలో తమ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెట్టి వేధించారని ఆయన విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే అభిమానులను, కార్యకర్తలను విస్మరించబోమని చంద్రబాబు అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, తనను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లేనని చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కాంగ్రెసు శాసనసభ్యురాలు కుతూహలమ్మ, ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితరులు సోమవారం పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో 2009 ఫలితాలు పునరావృతమవుతాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు తెరాసకు 20 సీట్లకు మించి ఒక్కటి కూడా ఎక్కువ రావని ఆయన అన్నారు.
తెరాసకు ఓటు వేస్తే దొరల పాలనకు ఓటు వేసినట్లేనని, కాంగ్రెసుకు ఓటేస్తే అవినీతి పాలనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications