ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ దూకుడు: బాబులో టెన్షన్, ఎంపీలకు క్లాస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కాంగ్రెసు పార్టీ దూకుడుగా వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిలో టెన్షన్ పెరిగినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా కల్పించకపోవడంపై కాంగ్రెసు జాతీయ స్థాయిలో చర్చనీయం చేయడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
ఎపికి ప్రత్యేక హోదాపై కాంగ్రెసు దూకుడుగా వ్యవహరిస్తున్న స్థితిలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనిపై కాంగ్రెసు ఏ విధమైన వైఖరి అవలంబించబోతోందనేది దాదాపుగా ఖరారైనట్లే. ఈ స్థితిలో తమ పార్టీ పార్లమెంటు సభ్యులు వెనకబడి పోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెసుతో గొంతు కలిపే ప్రమాదం ఉందని చంద్రబాబు అనుమానిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు సంయమనంతో వ్యవహరించడానికి అవసరమైన క్లాస్ను చంద్రబాబు తీసుకున్నట్లు చెబుతున్నారు.
శనివారం జరిగిన టిడిపి పార్లమెంటు సభ్యుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల అనుసరించాల్సిన వైఖరిపై మార్గనిర్దేశకత్వం చేసినట్లు తెలుస్తోంది. దేశానికి ఇప్పుడు మోడీ నాయకత్వం అవసరమని, అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కులో పడేసే విధంగా వ్యవహరించకూడదని ఆయన పార్లమెంటు సభ్యులకు సూచించినట్లు చెబుతున్నారు. ఎపికి ప్రత్యేక హోదా రాబట్టకపోతే పదవిలో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అనే కేంద్ర మంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ప్రకటన సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో రాజ్యసభలో ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ సభ్యులు సిఎం రమేష్, సుజనా చౌదరి వ్యవహరించిన తీరును కాంగ్రెసు లేవనెత్తి ఇరకాటంలో పెట్టడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఎపికి ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది వారే కదా అని సోనియా గాంధీ అనడాన్ని బట్టి పార్లమెంటు సమావేశాల్లో ఆ అంశంపై కాంగ్రెసు దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ దీనికి సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉన్న ఆటంకాలను అధిగమించడం కేంద్రానికి అంత సులభం కాదని తేలిపోయింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి మాటలే కాకుండా చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ఆ విషయాన్ని గుర్తు చేశాయి. ఎపికి ప్రత్యేక రాదనే భావన రాజకీయా పార్టీల్లోనే కాకుండా ప్రజానీకంలో కూడా నెలకొన్నట్లు అర్థమవుతోంది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తాను అనలేదని వెంకయ్య నాయుడు విమర్శల తీవ్రతను గమనించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏమైనా, చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధన అనేది సమస్యను తెచ్చే పెట్టే విధంగానే ఉంది.
కేంద్రంతో నెయ్యం కారణంగానే కాకుండా దాన్ని చెడగొట్టుకోకూడదనే ఉద్దేశం కారణంగా కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టే పరిస్థితి లేదు. దానిపై గట్టిగా మాట్లాడితే ప్రధాని మోడీతో సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది, మాట్లాడకపోతే ప్రతిపక్షాలకు చేజేతులా అస్త్రాన్ని అందించినట్లవుతుంది. అయితే, ప్రస్తుతానికి మోడీకి చిక్కులు కల్పించకూడదనే ఉద్దేశంతో సంయమనం పాటించాలని తన పార్టీ ఎంపీలకు ఆయన సూచనలు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications