సినీ నటుడు, గాజువాక కాంగ్రెసు అభ్యర్థి జీవిపై దాడి
విశాఖపట్నం: విశాఖపట్నం మహానగర పరిధిలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు జీవీ సుధాకర్నాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడితో సుధాకర్ నాయుడు మానసిక ఒత్తిడికి లోనై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. పెద్గగా గాయాలేమీ కాలేదని చెబుతున్నారు.
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - సోమవారం రాత్రి సుధాకర్నాయుడు ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకున్న అనంతరం కార్యకర్తలతో ఆటోనగర్లో సమావేశమై, అనంతరం ఆయన కూర్మన్నపాలెం శివాజీనగర్లో గల తన కార్యాలయానికి సన్నిహితులతో కలిసి రాత్రి 9గంటల సమయంలో వెళ్తున్నారు. కూర్మన్నపాలెం దాటిన తరువాత శనివాడ గ్రామానికి అనుకుని ఉన్న రేడియో రిసీవింగ్ స్టేషన్ సమీపంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని రహదారిపై నిలబడి అటుగా వెళ్తున్న సుధాకర్నాయుడు కారును అటకాయించారు.
కారు ఆపిన వెంటనే నిలుపుచేసిన వెంటనే నలుగురు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేస్తున్న తరుణంలో కారు నడుపుతున్న వ్యక్తి కారును వేగంగా ముందుకు లాగించారు. ఇది జరుగుతున్న తరుణంలో మరో నలుగురు ద్విక్ర వాహనాలపై వచ్చి దాడికి యత్నించారు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్పైకి దూసుకెళ్లింది. దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తులు అక్కడ నుండి పారిపోయినట్లు చెబుతున్నారు. వెంటనే దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
దాంతో సుధాకర్నాయుడ్ని చికిత్స నిమిత్తం గాజువాక ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే సుధాకర్నాయుడు బీపీ అధికంగా ఉండడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో వెంటనే విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి గాజువాక నుండి తరలించారు. కాగా, సోమవారం ఉదయం స్టీల్ప్లాంట్ మెయిన్గేటు సమీపంలో జరిగిన సమావేశంలో సుధాకర్నాయుడు మాట్లాడుతూ కొంత మంది వ్యక్తులు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని, అటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి జరగటం గమనార్హం.