జగన్పై చింతా మోహన్ మరో షాకింగ్-బెయిల్ రద్దు- 2019లో గెలుపు రహస్యమిదే
ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు చెప్పగానే విరుచుకుపడే రాజకీయ నేతల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఒకరు. తిరుపతి ఉపఎన్నికలో మరోసారి పోటీ పడిన ఆయన.. ప్రచారంలో భాగంగా జగన్పై రెచ్చిపోయారు. జగన్తో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, చెల్లెలు షర్మిలపైనా చింతా విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన తాజాగా మరో డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అదీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సమర్ధిస్తూ చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

చింతా మోహన్ టార్గెట్ జగన్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న చింతా మోహన్ ఈ మధ్య ఎందుకో వైసీపీ అధినేత, సీఎం జగన్పై వరుసగా విరుచుకుపడుతున్నారు. చింతా మోహన్ను వైసీపీ నేతలు కానీ జగన్ కానీ ఏమీ అనకుండానే అకారణంగా విమర్శలకు దిగుతున్నారు. మొన్న తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో జగన్ త్వరలో జైలుకు వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చింతా మోహన్ తాజాగా మరో అంశంపై తన డిమాండ్ వినిపించారు.

జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందే
అక్రమాస్తుల కేసులో గతంలో హైదరాబాద్లోని సీబీఐ కోర్టు వైఎస్ జగన్కు ఇచ్చిన కండిషనల్ బెయిల్ను రద్దు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. అందుకు కారణాలను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. సీబీఐ కోర్టు తక్షణం జగన్కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాల్సిందేనని కోరిన చింతా మోహన్, ఆ డిమాండ్ వెనుక తనకున్న కారణాలను కూడా తాజాగా వివరించారు. దీంతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బాటనే చింతామోహన్ కూడా ఎంచుకుంటారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న జగన్
తన అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారిని, సాక్షుల్ని సీఎం జగన్ ప్రభావితం చేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. ఇది జగన్కు గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలకు విరుద్ధమన్నారు. అందుకే జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ తన అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న శ్రీలక్ష్మితో పాటు పలువురు అధికారుల్ని తన ప్రభుత్వంలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. తద్వారా వారిని ప్రభావితం చేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు.

చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు
సీఎం జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించి సాక్షుల్ని ప్రభావితం చేస్తుంటే కోర్టులు ఎందుకు పట్టించుకోవడం లేదని చింతా మోహన్ ప్రశ్నించారు. న్యాయస్ధానాలకు కళ్లు లేవా అని ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలో న్యాయస్ధానాల చిత్తశుద్ధిని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చింతా మోహన్ పేర్కొన్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకున్న బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపారని, వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ను మాత్రం వదిలేస్తున్నారని, లక్ష్మణ్కో న్యాయం జగన్కో న్యాయమా అని చింతా ప్రశ్నించారు.
Recommended Video

2019లో ఎలక్ట్రోరల్ మోసంతో జగన్, బీజేపీ గెలుపు
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీ ఎలక్ట్రోరల్ మోసంతో గెలిచారని చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ ప్రజలు ఈ ఎలక్ట్రోరల్ మోసంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చింతా తెలిపారు. ఎలక్ట్రోరల్ మోసం జరిగిందా లేదా అన్నదానిపై ప్రధాని మోడీ నోరు విప్పాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సీఆర్పీఎఫ్, ఎన్నికల కమిషన్ కుమ్మకయ్యాయని చింతా సంచలన విమర్శలు చేశారు. అసలు పోలింగ్ తేదీకీ, కౌంటింగ్ తేదీకి మధ్య అంత విరామం ఎందుకన్నారు.












Click it and Unblock the Notifications