కాంగ్రెస్ నాయకురాలు పద్మశ్రీ అసలు నాకు పోటీనే కాదు...ఆమెది రౌడీ షీట్ చరిత్ర:వల్లభనేని వంశి
విజయవాడ:కాంగ్రెస్ నేత పద్మశ్రీ రాజకీయంగా తనకు పోటీయే కాదని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. పద్మశ్రీ రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే, కనీసం నాలుగువేల ఓట్లు కూడా రాలేదని ఆయన ఎద్దేవాచేశారు.
ఎపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మపై చీటింగ్ కేసు...తనపై ఆరోపణల విషయమై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె మీద కేసులు పెట్టించాల్సిన అవసరం తనకు లేదని, గ్రామదర్శిలో మరియంబీ అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారని వల్లభనేని వంశీ తెలిపారు. తనపై విమర్శలకు గాను ఆమెకు త్వరలోనే పరువు నష్టం నోటీసులు పంపించనున్నట్లు వంశీ వెల్లడించారు.
పద్మశ్రీది...రౌడీ షీట్ చరిత్ర
ఎపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీకి గతంలో రౌడీషీట్ ఉన్న చరిత్ర ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి చెప్పారు. బాలుడి కిడ్నాప్తో పాటు ఆమె ఎన్నో పంచాయితీలు చేశారని తెలిపారు. తాజా కేసు కూడా గ్రామదర్శినిలో మరియంబీ అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారని వల్లభనేని వంశీ తెలిపారు. ఎవరి విషయంలోనూ తాను కక్ష్యపూరితంగా వ్యవహరించలేదన్నారు. పద్మశ్రీపై కేసు పెట్టాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
బాధితురాలి ఫిర్యాదు...పోలీసు కేసు
పద్మశ్రీకి డబ్బులిచ్చానని, వసూలు చేసుకోమని ప్రవీణ్ తనతో చెప్పారని, డబ్బులు అడిగేందుకు వెళ్తే పద్మశ్రీ తనను కొట్టించిందని మరియంబీ చెబుతున్నారు. భర్తను చంపుకోవాల్సిన అవసరం తనకు లేదని, అతడు తాగితాగి చనిపోయాడని, బిడ్డను కూడా పోగొట్టుకున్న తాను అబద్ధం ఎందుకు చెప్తానని మరియంబీ ప్రశ్నించారు. మరోవైపు రాజకీయంగా ఆమెని ఎదుర్కోలేక పోలీసు కేసు పెట్టించినట్లు చేస్తున్న ఆరోపణలను వల్లభనేని వంశీ ఖండించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకే పోలీసులు పద్మశ్రీపై కేసులు పెట్టారని తెలిపారు.
ఆమె...నాకు పోటీనే కాదు
రాజకీయంగా ఆమెని ఎదుర్కోలేక కేసు పెట్టించాననే ఆరోపణలు హాస్యాస్పదమని వల్లభనేని వంశి కొట్టిపడేశారు. అసలు కాంగ్రెస్ నేత పద్మశ్రీ రాజకీయంగా తనకు పోటీయే కాదని ఆయన చెప్పారు. పద్మశ్రీ రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే, కనీసం నాలుగువేల ఓట్లు రాలేదని ఎద్దేవాచేశారు.
తప్పుడు ఆరోపణలు...పరువు నష్టం దావా..
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పద్మశ్రీపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే వంశీ వల్లభనేని వంశీ హెచ్చరించారు. తనపై విమర్శలకు గాను ఆమెకు త్వరలోనే పరువు నష్టం నోటీసులు పంపించనున్నట్లు వెల్లడించారు.