ఆంధ్రప్రదేశ్ రాజధానులపై స్పష్టత ఇచ్చిన రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ లో మూడు సంవత్సరాలుగా నలుగుతున్న రాజధానుల అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. తమ పార్టీ మద్దతు అమరావతికేనని అగ్రనేత రాహుల్ గాందీ స్పష్టం చేశారు. రాహుల్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ఏపీలోని కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఆయన ఆలూరు సరిహద్దుకు రాగా పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఏపీలో నాలుగురోజులపాటు జోడో యాత్ర సాగనుంది.
ఆలూరు, హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని మండలం శాగి దగ్గర ముగిసింది. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. యాత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, తెలంగాణ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ జేడీ శీలం, పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ యాత్ర జయప్రదం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీసంఖ్యలో జన సమీకరణ చేపట్టి విజయవంతమయ్యారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏపీలోకి పాదం మోపిన రాహుల్ ను అమరావతి జేఏసీ నేతలు, రైతులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులు కలిశారు. వారంతా నినాదాలు చేస్తూ వచ్చారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలంటూ వినతిపత్రం అందజేశారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని, రైతుల పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. వారి పోరాటానికి అవసరమైతే న్యాయ సహాయాన్ని కూడా అందిస్తామన్నారు.
జోడో యాత్ర నాలుగు రోజులు ఏపీలో కొనసాగి తిరిగి కర్ణాటకలోకి ప్రవేశించనుంది. అనంతరం తెలంగాణలోకి ప్రవేశించి 14 రోజులపాట సాగనుంది. అనంతరం తిరిగి కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు రాహుల్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు.