"కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది బ్లాక్ మనీని మార్చుకునేందుకే!.."
తన వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు.
సూర్యాపేట: పెద్ద నోట్ల రద్దు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తప్పుబట్టారు. తన వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ప్రజల కష్టాలను తీర్చడం కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు దామోదర్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగివేసారని దామోదర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాల పనితీరుపై అసహనంతో ఉన్న జనం తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడుతుందని చెప్పారు.
పార్టీ తరుపున ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు.
పెద్ద నోట్ల రద్దుతో బడాబాబులంతా దర్జాగానే ఉన్నారని, పేదలు మాత్రమే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో ఉత్పన్నమైన సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈ నెల 7న సూర్యాపేటలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు దామోదర్ రెడ్డి ప్రకటించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీఎల్పీ నేత జానారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలియజేశారు.












Click it and Unblock the Notifications