బయట తిరగలేరు: ప్రత్యేక హోదాపై వెంకయ్య హెచ్చరిక, 'బీహార్' బీజేపీదే
హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తన పైన ఏపీలో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టడం పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు తనదైన శైలిలో స్పందించారు.
ఆలస్యంగా ఉదయిస్తున్నాడని సూర్యుడి పైన కూడా కేసులు పెడతారేమోనని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి కేసులు పెడితే దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
ప్రతిపక్షాలు జిఎస్టీ బిల్లును అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. భూసేకరణ బిల్లును అడ్డుకోవడం సరికాదన్నారు. బిల్లు పైన చర్చ జరిగాక అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా అవుతుందన్నారు.

బీహార్ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపినే గెలుస్తుందని వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 25 ఏళ్ల నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ ఆటవిక పాలన కావాలో, లేక ప్రజాస్వామ్య పాలన కావాలో బీహార్ ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ఆటవిక పాలనను ఇంకా అక్కడి ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయరన్నారు. శీతాకాల సమావేశాలు ముందుగానే జరపాలనుకుంటున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతు ఆత్మహత్యల పైన కూడా ఆయన స్పందించారు. ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications