డిగ్గీకి షాక్: తెరాస వైపు ఎమ్మెల్యేల చూపు, చేరకుండా..
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వైపు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఫిరాయింపుల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తెరాస వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్, సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు హాజరు కాలేదు. ఆయన ఎందుకు రాలేదని ఆరా తీసేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించారు. కానీ ఆయనకు ఫోన్లో దొరకలేదు.
దిగ్విజయ్ సింగ్ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే సదరు ఎమ్మెల్యే జిల్లాకు చెందిన మంత్రితో భేటీ అయ్యారని తెలుసుకున్నారట. ఆ పార్టీలో అనుబంధ సభ్యుడిగా చేరనున్నట్లు దిగ్విజయ్ సింగ్ దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెరాసతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వారు తెరాసలో చేరకుండా అనుబంధ సభ్యులుగా ఉండే అవకాశముందంటున్నారు.