సిఎం రాజీనామా చేసి హీరో: ఉమా, గంటా సంచలనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జనవరి 23న తన పదవికి రాజీనామా చేసి హీరో అవుదామని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర సమైక్యంపై చిత్తశుద్ధి ఉంటే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, స్పీకర్ నాదెండ్ల మనోహర్లు రాజీనామా చేయించాలని అన్నారు. ఫిబ్రవరిలోపు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అన్నారు.
గంటా సంచలన వ్యాఖ్యలు
తూర్పు గోదావరి: రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు 25 మంది ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని తెలిపారని, వారందరూ పార్టీని ఎందుకు వీడాలని అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఆ 25మంది ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని గంటా స్పష్టం చేశారు. తమ తక్షణ కర్తవ్యం విభజనను ఆపడమేనని ఆయన అన్నారు. అందుకోసం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత అయన్నపాత్రుడిపై తీవ్రంగా స్పందించారు. అయ్యన్నపాత్రుడికి మానసిక స్థితి బాగోలేదని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.
స్వార్థం కోసమే విభజన: కావూరి
స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన జరుగుతోందని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఆరోపించారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు.