జగన్కు బెయిల్: అధిష్టానంపై గుర్రు, కిరణ్ బుజ్జగింపు!
రాష్ట్రంలో మారిన పరిణామాల నేపథ్యంలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, రాయపాటి సాంబశివ రావు, ఎస్పీవై రెడ్డి, సాయి ప్రతాప్ సోమవారం ఢిల్లీలో లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. రాజీనామాలను ఆమోదించుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానంపై రాయపాటి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
పార్టీని ప్రజల్లో నిలబెడుతున్న తమకు పార్టీ అన్యాయం చేస్తోందని రాయపాటి ఆవేదన వ్యక్తం చేశారట. కాంగ్రెస్ హైకమాండ్ జగన్తో చేతులు కలిపిందని, ఆయనకు బెయిల్ ఇప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆక్రోశించారట.ఇలాంటప్పుడు ఇంకా కాంగ్రెస్లో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ పదవులతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేసేద్దామని ప్రతిపాదించారట.
అయితే, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మారుస్తామని ప్రజలకు చెబుతున్న మనమే పార్టీకి రాజీనామాలు చేయటం సరికాదని ఒకరిద్దరు ఎంపీలు సూచించారు. ప్రస్తుతానికి మనం పదవుల్ని వదులుకుంటే చాలని, పార్టీ సంఖ్యాబలం తగ్గుతుందని, తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర ఎంపీలు కూడా అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తారని, తద్వారా అధిష్ఠానం వైఖరిలో మార్పు తీసుకు రావొచ్చునని, పార్టీకి రాజీనామాలు వద్దని తెలిపారు.
ఎంపీలకు కిరణ్ పిలుపు
ఎపి భవన్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డితో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఎంపీల రాజీనామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. తర్వాత పలువురు ఎంపీలకు ఫోన్లు చేసి ఎపి భవన్కు రావాలని కోరారు. లగడపాటి, అనంత, ఉండవల్లి మాత్రం ఎపి భవన్కు రాలేదు. రాయపాటి, సాయిప్రతాప్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం వచ్చారు. రాజీనామాలపై కిరణ్, బొత్స ఎంపీలను బుజ్జగించారు.
రాజీనామాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండటం ఎంత అవసరమో, బిల్లు అడ్డుకునేందుకు లోక్సభలో ఎంపీలు ఉండటం కూడా అంతే అవసరమని కిరణ్ తెలిపారు. దీంతో సమావేశానికి హాజరైన ఎంపీలు కొంత మెత్తబడ్డారు.
మిగతా ఎంపీలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో మంగళవారం ఉదయం స్పీకర్ అపాయింట్మెంట్కంటే ముందే ఏపీ భవన్లో అల్పాహార విందుకు హాజరు కావాలని ఎంపీలను ముఖ్యమంత్రి కోరారు. అప్పుడు అంతా కలిసి కూర్చుని, ఏ నిర్ణయం తీసుకున్నా సమైక్యంగా తీసుకోవచ్చునని సూచించారు.