జగన్, బాబు..: కాంగ్ ఒక్క దెబ్బకు 4పిట్టలు సాధ్యమా?
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాయల తెలంగాణతో ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందా? అంటే అవుననే అంటున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం మేరకు హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నామని ఢిల్లీ పెద్దలు చెబుతూనే రాయల తెలంగాణపై ఆలోచన చేయడం చూస్తుంటే బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను రెండు ప్రాంతాల్లో దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగానే అది తెరపైకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి వరకు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, దానిపై వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. అయితే నాలుగు రోజులుగా రాయల తెలంగాణ మరోమారు తెరపైకి వచ్చింది. తెలంగాణతో పాటు రాయల తెలంగాణ పైన కేంద్రం ఆలోచిస్తోందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సైతం చెప్పారు. తాను తెలంగాణనే కోరుకుంటున్నానని చెప్పిన దామోదర.. రాయల తెలంగాణకు అధిష్టానం మొగ్గినా కట్టుబడి ఉంటానని ప్రకటించారు.

కేంద్రం తెలంగాణతో పాటు రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం. దీంతో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, రాయల టిని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలతో పాటు తెలంగాణవాదులు, సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు అధిష్టానం, కేంద్రం సిద్ధపడినప్పటికీ మెజార్టీ సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాయల తెలంగాణ అస్త్రాన్ని ఢిల్లీ పెద్దలు బయటకు తీశారంటున్నారు. ఇది వ్యూహాత్మకమే అంటున్నారు. రాయల టి పైన ఎవరు ఎలా స్పందిస్తారో తెలుసుకునే ఉద్దేశ్యంలో భాగమేనంటున్నారు. విభజన కోసం రాయల అంశాన్ని తెచ్చారని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే వ్యతిరేకిస్తామని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్రతో బిల్లు పంపిస్తే సమైక్యాంధ్ర నేతలు మెజార్టీ ఉన్నందున అసెంబ్లీలో టి బిల్లుకు షాక్ తగిలే అవకాశముంది. అయితే రాయల తెలంగాణను కూడా పొందుపరిస్తే కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆ వైపు మొగ్గు చూపడం ద్వారా సమైక్యం బలం తగ్గుతుంది. ఈ వ్యూహంలోనే బిల్లుకు ముందు రాయల టిని మరోసారి తెరపైకి తీసుకు వచ్చారంటున్నారు.
అయితే, రాయల తెలంగాణ ఆప్షన్ కూడా ఢిల్లీ మదిలో లేకపోలేదంటున్నారు. కాంగ్రెసు పార్టీ విభజనను రాజకీయ లబ్ధి కోసమే చేస్తోందని, తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశాలు కనిపించకపోవడం, సీమాంధ్రలో పార్టీ ఘోరంగా దెబ్బతిని అసలుకే మోసం వచ్చే అవకాశాలను గమనించి ఇప్పుడు రాయల తెలంగాణ అంటోందని మరికొందరు అంటున్నారు.
దీంతో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయవచ్చునని భావిస్తోందంటున్నారు. రాయల తెలంగాణకు కాంగ్రెసు ముందడుగు వేస్తే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కేవలం సీమాంధ్రకే పరిమితం అవుతాయని, విభజనలో సమన్యాయం పాటించారనే భావన సీమాంధ్ర ప్రజల్లో కలుగుతుందని, అప్పుడు 2014 ఎన్నికల్లో ఆ పార్టీలను ధీటుగా ఎదుర్కొనవచ్చునని, ఇక తెలంగాణలో తెరాస కేవలం నాలుగైదు జిల్లాలకే పరిమితమైందని, ఇప్పుడు అనంత, కర్నూలులను కలిపితే మరింత ఆ పార్టీకి షాక్ తగులుతుందని, అది కాంగ్రెసుకు లాభిస్తుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. బిజెపికి కూడా తెరాసలాగే దెబ్బ తగులుతుందని కాంగ్రెసు భావిస్తోందంటున్నారు. అందుకే ఈ రాయల టిని తెరపైకి తీసుకు వచ్చిందంటున్నారు.
వ్యూహం ఫలిస్తుందా?
అసెంబ్లీలో టిని గట్టెక్కించేందుకు రాయల తెలంగాణను తీసుకు వస్తే అక్కడ గట్టెక్కినా పార్లమెంటులో కాంగ్రెసు ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేస్తోందని పలు పార్టీలు వెనక్కి పోయే అవకాశముందంటున్నారు. కాంగ్రెసు నిజంగానే రాయల తెలంగాణ అంటే తెలంగాణకే కట్టుబడి ఉన్న బిజెపి, తెరాస వంటి పలు పార్టీలు మద్దతిచ్చే అవకాశం లేదు. తెలంగాణ అంటూ, రాయల తెలంగాణ అంటూ కాంగ్రెసు సీటు లెక్కలు వేస్తే విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలు కూడా రాయల టికి మద్దతివ్వకపోవచ్చునంటున్నారు.
కాంగ్రెసు తెలంగాణకు కట్టుబడితే పార్లమెంటులో బిజెపి, తెరాస, బిఎస్పీ వంటి పార్టీలతో విభజన సాఫిగా సాగుతుందని, రాయల తెలంగాణ అంటే మాత్రం కష్ట సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే రాయల తెలంగాణతో కాంగ్రెసుకు ఏమేరకు లబ్ధి చేకూరినా మజ్లిస్ పార్టీ మాత్రం బలపడుతుందని అంటున్నారు. అందుకోసమే ఆ పార్టీ రాయల టి గానం చేస్తోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications