పోచారం రిప్లై: ఏం చేయాలో తెలుసునని హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ శానససభలో జరిగిన చర్చకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. శాసనసభ సోమవారంనాడు రాత్రి పదిన్నర గంటల వరకు జరిగి రేపు మంగళవారం పది గంటలకు వాయిదా పడింది. పోచారం శ్రీనివాస రెడ్డి సమాధానం ఇచ్చిన తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో శాసనసభ అంటే వాయిదాలు, సస్పెన్షన్లేనని అన్నారు.
తమకు శాసనసభ అంటే చర్చ, సమాధానం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అని ఆయన అన్నారు. దాదాపు 12 గంటల పాటు నేడు శాసనసభలో చర్చించామని, ప్రతి సభ్యుడి ప్రశ్నకు తమ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. ఇంత సేపు సభ జరిగిందంటే ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. సభను తాము వాయిదా వేసుకుని వెళ్లబోమని, చర్చిస్తామని, సభను నడిపిస్తామని ఆయన అన్నారు. అడ్డుకుంటే ఒకటికి రెండు సార్లు వినతులు చేస్తామని, వినకపోతే ఏం చేసి నడిపించాలో అది చేసి నడిపిస్తామని ఆయన అన్నారు. రేపు కూడా రాత్రంతా సభను నడుపుదామని ఆయన అన్నారు.
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఉద్యానవన పంటలకు 15 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఆయన చెప్పారు. లక్ష రూపాయలపైన అప్పున్న రైతులు 25 శాతం మంది ఉన్నారని ఆయన చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. రైతు సమస్యలపై తెల్లారే వరకు మాట్లాడుకుందామని ప్రతిపక్షాల అభ్యంతరంపై ప్రతిస్పందనగా ఆయన అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే 80 శాతం రుణాలను మాఫీ చేశామని చెప్పారు. 36 లక్షల మంది రైతుల్లో 33 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే 25 శాతం రుణమాఫీ డబ్బులు జమ అయినట్లు తెలిపారు.
రైతులకు సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ విస్తరణాధికారులు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. సోలారు పంపుసెట్లకు లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని, ఈ సబ్సిడీని కేంద్రం ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని పోచారం అన్నారు. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అధికారుల నివేదిక ఆధారంగా నష్టపరిహారం ఇస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే 49 కటుంబాలకు 50 వేల రూపాయలేసి ఇచ్చినట్లు తెలిపారు. భూసార పరీక్షలకు 20 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. సోలారు పంపుసెట్లకు లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం, కేంద్రం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.
త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తామని పోచారం చెప్పారు. కుటుంబానికి రెండు పాలిచ్చే బర్రెల సరఫరా కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని, జాలర్లకు సీడ్స్ పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 9 వేల చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఈ డిసెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకోవడానికి, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సహాయం అందించడానికి, మొత్తంగానే రైతుల ఆత్మహత్యలను నివారించడానికి తాము కార్యక్రమాలు చేపట్టినట్లు పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు.