చిరంజీవి దూరం పాటిస్తున్నారా, ఆయనతో కాదనుకుంటున్నారా?
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత వైయస్ జగన్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని, వారు ప్రజల తరఫున పోరాడితే తాము మద్దతిస్తామని ప్రకటనలు చేస్తున్నారు.
అంతేకాదు, ఓ నేత తమ పార్టీలో నాయకత్వ లోటు ఉందని, అందుకే పవన్, జగన్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో పార్టీని నడిపించే నాయకులే లేకుండా పోయారా అనే చర్చ సాగుతోంది. విభజన దెబ్బకు ఇప్పటి వరకు ఆ పార్టీ కోలుకోలేదు.
2019 నాటికి ఎలాగైనా గత వైభవం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం జగన్, పవన్ కళ్యాణ్ వంటి వారిని కూడా ఆహ్వానిస్తోంది. అయితే, చిరంజీవి వంటి మాస్ ఇమేజ్ కలిగిన నేత ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతల కోసం పాకులాడటం చర్చనీయాంశమయింది.
చిరంజీవికి మంచి ఇమేజ్ ఉంది. ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంది. 2009లో పార్టీ పెట్టి, సొంతగా పోటీ చేసి మంచి ఓటు షేర్ సాధించాడు. సీట్ల విషయాన్ని పక్కన పెటితే ప్రజారాజ్యం పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. అలాంటి వ్యక్తిని కాదని నాయకత్వ లోటు ఉందని చెప్పడం చర్చనీయంశమవుతోంది.
దీంతో, చిరంజీవి ఇమేజ్ను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోతోందా? ఆయన రాజకీయాల పైన అసంతృప్తితో కొంత దూరం పాటిస్తున్నారా? లేక ఆయనలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లేమి ఉందని భావిస్తోందా? అనే చర్చ సాగుతోంది. లేదంటే ఎందరో అనుభవజ్ఞులు ఉన్న నాయకులు, మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి ఉండగా నాయకత్వ లేమి ఉందని చెప్పడమేమిటని అంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పటి దాకా రెండు మూడు సినిమాలు చేసి ఆ తర్వాత ఫుల్స్టాప్ చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. మరోవైపు చిరంజీవి ఇటీవలి కాలంలో సినిమాల వైపుకు మళ్లుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. పవన్ ఇటు (రాజకీయాలు), చిరు (సినిమాల) వైపు మళ్లుతున్నారా అనే చర్చ సాగుతోంది.