వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు గెలుపు...పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి
గుంటూరు:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దేశానికి...రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అభివర్ణించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని గాంధీచౌక్లో జరిగిన బహిరంగ సభలో రఘువీరారెడ్డి ప్రసంగించారు.బిజెపి పాలనలో ప్రజల జీవనం అతలాకుతలమైందని, 2019లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని కావడం ఖాయమని ఎన్.రఘువీరారెడ్డి
అన్నారు. రాహుల్ ప్రధాని అయ్యాక తొలి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపైనేనని పునరుద్ఘాటించారు.

గడచిన నాలుగున్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేందుకు ఎన్నో పోరాటాల్ని చేస్తూ వచ్చిందన్నారు. గుంటూరులో 12 రాజకీయ పార్టీలతో ప్రత్యేక హోదా సాధనపై ఏర్పాటుచేసిన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం పాల్గొన్నారని రఘువీరా గుర్తుచేశారు. మనం ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన న్యాయం జరగలేదన్నారు. విభజన హామీల అమలుకు తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి వైఫల్యం చెందిందని అన్నారు.
కాంగ్రెస్ గత ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, లోటు బడ్జెట్ భర్తీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోను, 11 జాతీయ సంస్థల ఏర్పాటు ఇప్పటికే పూర్తయి ఉండేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో వివిధ సామాజిక తరగతులు, ప్రజలపై దాడులు పెరిగిన నేపథ్యంలో బిజెపి పాలనపై ప్రజలు విసిగిపోయారని రఘువీరా చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, రైతులు, డ్వాక్రా మహిళలకు రూ.రెండు లక్షల వరకు రుణాలు రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ ప్రీమియంను రూ. 5 లక్షలు చేస్తామని, జిఎస్టిలో సడలింపులు తెస్తామని రఘువీరా ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులు నెల రోజులపాటు ఇంటింటికీ వెళ్లి పార్టీ మేనిఫెస్టోను అన్నివర్గాలకు చేరువ చేయాలన్నారు. ఒక రూపాయి విరాళాన్ని సేకరించి కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కోరాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే తొలి విజయం సాధించి అమరావతిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు.












Click it and Unblock the Notifications