హైద్రాబాద్ కుట్ర, రాజకీయాలొద్దనుకున్నా కానీ: కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మనకు దక్కకుండా కేంద్రపాలిత ప్రాంతం చేసేలా కుట్ర జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలింగ్ ముగియగానే మోడీతో చంద్రబాబు హైదరాబాద్ పైన యూటి ప్రకటన చేయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ బతుకు సున్నా అని.. ఆయన చంద్రబాబు ఉచ్చులో పడ్డారన్నారు. టిడిపిని నమ్ముకున్న మోడీ తెలంగాణ దుష్మన్ అన్నారు.
కెసిఆర్ రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి, మెదక్ జిల్లా సంగారెడ్డి, కుషాయిగూడ, బోడుప్పల్, సికింద్రాబాద్ చిలకలగూడ, ఎల్బీనగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. మోడీని పిచ్చివాడిగా అభివర్ణించారు. ఆయన తన కాలు తానే నరుక్కుంటున్నాడని, తన గొయ్యి తానే తీసుకుంటున్నారని అన్నారు. బిడ్డకు జన్మనిచ్చి తల్లి చనిపోయిందని మోడీ అంటున్నాడని, కానీ, రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ తల్లి ఆనంద బాష్పాలు రాల్చిందన్నారు. తెలంగాణ గురించి మోడీకేం తెలుసన్నారు.
సోనియా, రాహుల్, మన్మోహన్ సహా జాతీయ నాయకులు, చంద్రబాబు అంతా తనను టార్గెట్ చేసి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఈ బక్కోడిని కొట్టడానికి ఇంతమందా? అని చమత్కరించారు. పోరాడిన వాళ్లకే ఏం చేసుకోవాలో తెలుస్తుందని, రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, ప్రజలకు న్యాయం తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవాలని భావించానని, కానీ, సమాజం నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా కొనసాగుతున్నానన్నారు.
తెలంగాణ తెచ్చిన కీర్తి, తృప్తి తనకు వెయ్యి జన్మలకు చాలని, సమాజానికి ఇంత గొప్ప పని చేశాం కనక పక్కకు జరుగుదామనే అనుకున్నానని కానీ, సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని అందుకే కొనసాగుతున్నట్లు చెప్పారు. ఆ సినిమా యాక్టరుగాడు.. ఈ సొల్లు గాళ్లతో మాటలు పడే ఖర్మ నాకెందుకు? కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను ఈ దరిద్రపు సన్నాసులు, రాజకీయ పిగ్మీల చేతిలో పెట్టరాదన్న ఉద్దేశంతోనే తెరాస పోరు బరిలో ఉందన్నారు.
తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన తెరాస ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత కెసిఆర్ వేదిక మెట్లు ఎక్కబోతూ కాలుజారి కిందపడబోయారు. అయితే, ఆయన వెనుకే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఆయన కింద పడకుండా పట్టుకున్నారు.