ఉద్యోగం కోసం పరిగెత్తి ప్రాణం పోగొట్టుకున్నాడు-బందరులో విషాదం..!
ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో ఇవాళ ఓ విషాదం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్ధులకు నిర్వహిస్తున్న ఫిట్ నెస్ పరీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ అభ్యర్ధి పరుగు తీస్తూ ప్రాణం కోల్పోయాడు. దీంతో బందరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తి కావడంతో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యమైన పరుగు పందెం ఈ విషాదానికి కారణమైంది.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరుగు పందెం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన ధారావత్ చంద్రశేఖర్ అనే అభ్యర్ధి 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఇతర అభ్యర్ధులతో కలిసి కాసేపు పరుగు తీసిన హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే గుర్తించిన పోలీసులు.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను చనిపోయాడు.

కానిస్టేబుల్ పరుగు పందెంలో మృతి చెందిన అభ్యర్థి కృష్ణాజిల్లా ఏ కొండూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా బందరులో దేహదారుద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ఇలా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దేహ దారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. అయితే శుభవార్తతో ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ తీరని శోకం మిగిల్చాడు.












Click it and Unblock the Notifications