వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం- రూ 8.20 కోట్ల సొంత నిధులతో : ప్రభుత్వానికి నష్టమా- హట్ టాపిక్ గా...!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్ణయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎమ్మెల్యే తన సొంత నిధులతో రోడ్ల రిపేర్లకు ముందుకు వచ్చారు. రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితులు..బకాయిల కారణంగా కొత్తగా పనులు చేయటానికి కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇక, ఏపీలో కొంత కాలంగా రోడ్ల మరమ్మత్తుల అంశం రాజకీయ వివాదంగా మారింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ రెండున్నారేళ్ల కాలంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టకపోవటం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం
జనసేన అధినేత పవన్ స్వయంగా రోడ్ల రిపేర్ల కోసం శ్రమదానం నిర్వహించారు. ప్రజల్లోని రోడ్ల దుస్థితి పైన అసహనం కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల నుంచి ఇదే అంశం పైన ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. ప్రభుత్వం రూ 2,200 కోట్ల నిధులు కేటాయించి..రోడ్ల మరమ్మత్తుల కోసం నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు మందుకు రావటం లేదు. దీంతో.. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..తాజాగా విప్ పదవి పొందిన తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సొంత నిధులతో రోడ్ల మరమ్మత్తుల కోసం
తన నియోజవకర్గ పరిధిలో రోడ్ల మరమ్మత్తుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. రోడ్ల రిపేర్ల కోసం టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో.. జగ్గిరెడ్డి తానే సొంత ఖర్చులతో..తానే రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం తానే యంత్రాలను నడిపిస్తూ రోడ్లు వేయటం ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం సొంత నిధులు 8కోట్ల 20లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్నారు. భారీ గుంతలు పూడ్చడంతో పాటుగా ..60 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. వాహనాలు సైతం నడవలేని స్థితిలో ఉన్నాయి.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చినా..కాంట్రాక్టర్లు తమ పాత బకాయిలు చెల్లించాలని పట్టు బడుతున్నారు. ప్రభుత్వ టెండర్లలో వారు ముందుకు రావటం లేదు. దీంతో.. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక.. నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం ఆగదని నిరూపించడానికే రోడ్లు వేయిస్తున్నానని జగ్గిరెడ్డి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం చేయాల్సిన పని..ఎమ్మెల్యే సొంత నిధులతో చేయటం ఒక విధంగా ప్రభుత్వం పైన విమర్శలకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించటమే అనే చర్చ మొదలైంది.
Recommended Video
సోషల్ మీడియాలో..వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ
అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉంటూ.. ప్రభుత్వమే వాటిని బాగు చేయించాలనే ఆలోచన పక్కన పెట్టి.. ఎమ్మెల్యే సొంత నిధులతో రిపేర్లు చేయించేందుకు ముందుకు రావటం పైన నియోజవకర్గంలో ఆయనకు ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్ణయం పైన కలిగే లాభ - నష్టాల పైన ఇప్పుడు అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జగ్గిరెడ్డి నిర్ణయం పైన సోషల్ మీడియాలో నూ చర్చ మొదలైంది.