జగన్ దేవుని బిడ్డ: పురపాలకశాఖ కమిషనర్ విజయ్కుమార్ వింత భజన
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలను అర్హత ఉన్న అభ్యర్థులకు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పురపాలకశాఖ కమిషనర్ జేఎస్సార్కే ఆర్ విజయకుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి.
జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన పురపాలక శాఖ కమీషనర్
పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ రేంజిలో జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. సచివాలయ వ్యవస్థను సంకల్పించడం ద్వారా జగన్ స్థానిక పరిపాలన వ్యవస్థలో సెప్టెంబరు రివల్యూషన్ ను తీసుకొచ్చారని విజయకుమార్ కొనియాడారు. అంతేకాదు గుప్తుల స్వర్ణ యుగాన్ని గుర్తుకు తెస్తున్నారని జగన్ను ఆయన ప్రశంసించారు. ఇక దేవుడి బిడ్డ జగన్ అని కీర్తించారు.
సీఎం జగన్ భజన చేసిన ఉన్నతాధికారి
అశోకుడికి దేవతలు మెచ్చిన రాజు అనే బిరుదు ఉండేదని, అలానే ఏపీని జనరంజకంగా పాలిస్తున్న జగన్ ఇప్పుడు దేవుడి బిడ్డ అయ్యారని పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి. ఒక ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించకుండా ఈ విధంగా సీఎం జగన్ ను దేవుని బిడ్డ అంటూ పొగడ్తల వర్షం కురిపించడంపై రాజకీయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో, ఒక ఉన్నతాధికారి ఒక రాజకీయ నాయకునిలా జగన్ దేవుని బిడ్డ అని స్తుతిస్తూ చేసిన హంగామా అందరూ నివ్వెరపోయేలా చేసింది.
ఉన్నతాధికారా లేక రాజకీయ నాయకుడా.. అవాక్కైన జనం
రాజకీయ పార్టీలలో ముఖ్యంగా అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీల నేతలు చేసే ఈ వ్యవహారం, ప్రభుత్వ ఉన్నతాధికారులు చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది ఇక అంతటితో ఆగక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం పొందడం ఒక పెద్ద కలగా మారిందని, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కలలు సాకారం అయ్యాయని ఏకంగా పురపాలక శాఖ కమిషనర్ పేర్కొనడం ఆయన ఒక ఉన్నతాధికారా లేక రాజకీయ నాయకుడా అన్న భావన కలిగించింది.
వివాదాస్పదంగా విజయ కుమార్ వ్యాఖ్యల దుమారం ..
కారు చీకట్లో కాంతి రేఖలా జగన్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాల భర్తీ చేపట్టి యువతను ప్రభుత్వ ఉద్యోగులను చేసిందని పేర్కొన్న ఆయన పనిలో పనిగా మంత్రి బొత్స సత్యనారాయణను సునిశిత మేధావిగా, ఏకసంథాగ్రాహిగా పొగిడేశారు. మొత్తంగా అధికారిక కార్యక్రమం కాస్తా ఫక్తు రాజకీయ కార్యక్రమంగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులుగా తమ విధి నిర్వహణలో కచ్చితంగా వ్యవహరించాల్సిన, పని చెయ్యాల్సిన ఉద్యోగులు ఆ పని మరిచి ఇలా భజన చెయ్యటం మాత్రం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.