'చింతమనేని.. పిచ్చి వేషాలు మానుకో..': టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి వార్నింగ్
ఏలూరు అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు 2014 ఎన్నికల సమయంలో చింతమనేనికి భారీ మొత్తంలో డబ్బు ముట్టిందని పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు.
ఏలూరు: వివాదస్పద తీరుకు కేరాఫ్గా మారిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ మరో వివాదం వేడెక్కుతోంది. ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టడం కోసం రూ.40లక్షల ముడుపులు తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీనో.. లేక బయటి వ్యక్తులో చేస్తున్న ఆరోపణ కాదిది. సొంతగూటి నేతే చింతమనేనిపై ఈ ఆరోపణ చేస్తున్నారు. ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు 2014 ఎన్నికల సమయంలో చింతమనేనికి భారీ మొత్తంలో డబ్బు ముట్టిందని పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు.
చింతమనేని కుతంత్రాలు:
ఆ డబ్బు తీసుకుని రెడ్డి అనురాధను ఎంపీపీ పీఠం నుంచి తొలగించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి పదవి కట్టబెట్టేందుకు చింతమనేని కుతంత్రాలు చేస్తున్నాడని అప్పలనాయుడు మండిపడ్డారు. పైగా పార్టీ మారుతున్నారంటూ తమపై లేనిపోని ఆరోపణలను చింతమనేని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
లంచాలు పుచ్చుకున్నది కాదు..
గతంలో ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొన్న చింతమనేనికి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పలనాయుడు చురకలంటించారు. లంచాలు పుచ్చుకుని, ఇసుకతో పాటు అభివృద్ధి పేరిట ప్రభుత్వ సొమ్ము దోచుకుని తానేమి సంపాదించలేని వ్యంగ్యంగా మాట్లాడారు.
పిచ్చి వేషాలు మానుకో :
'చింతమనేని నీ పిచ్చి వేషాలు ఇకనైనా మానుకో.. సామాన్య ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినట్టు.. పార్టీ కార్యకర్తలు, నాయకులను అదే రీతిలో దూషిస్తే ఊరుకోం' అంటూ అప్పలనాయుడు చింతమనేనికి వార్నింగ్ ఇచ్చారు.
ఎంపీపీ పదవికి రాజీనామా:
అనంతరం టీడీపీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలతో అప్పలనాయుడు సమావేశం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి తన భార్య రెడ్డి అనురాధ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశానంతరం జడ్పీ కార్యాలయానికి వెళ్లి రాజీనామా లేఖ అందజేశారు.