పండగ వేళ భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
సంక్రాంతి పండుగ అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది పిండి వంటలు. మరి అలాంటి పిండి వంటల తయారీకి వంట నూనెలు చాలా ముఖ్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి నేపథ్యంలో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతికి ముందర మధ్యతరగతి ప్రజల జేబును చిల్లుపడేలా వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపు ఏడాది పాటు పెద్దగా కదలని ధరలు... కేవలం రెండు వారాల్లోనే రాకెట్ లా పైకి పోవడం మిడిల్ క్లాస్ ను షాక్ కు గురిచేసింది. పండగ సీజన్ కావడం, పిండి వంటల తయారీ కోసం నూనెల వినియోగం పెరగడం సహజమే అయినా... ఈ స్థాయిలో ధరల పెరుగుదల వెనుక మరిన్ని కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది.
సన్ ఫ్లవర్ ఆయిల్..
గత పదిహేను రోజుల వ్యవధిలో లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.5 వరకు పెరిగింది. దసరా పండగ సమయంలో ఉన్న రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇప్పుడు లీటరుకు దాదాపు రూ.10 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరుగుదలతో పాటు కొందరు వ్యాపారులు కావాలనే రేట్లు పెంచేస్తున్నారని టాక్. మరీ ముఖ్యంగా లూస్ ఆయిల్ విక్రయాలు పెంచడానికి ఓ వర్గం రెడీ అయిందని కూడా మార్కెట్లో చర్చ జరుగుతుంది. కేవలం మూడు నెలల్లోనే ఇంత పెరుగుదల రావడం పట్ల వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏ పండుగలకు లేని విధంగా..
సన్ ఫ్లవర్ ఆయిల్ ను దేశీయ అవసరాల కోసం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు ప్రభావం చూపుతుంటాయి. అయితే ఇటీవలి వరకు అంతర్జాతీయంగా పెద్దగా మార్పులు ఎక్కడా కూడా కనిపించలేదు. అయినా గత మార్చి నుంచి పరిశీలించుకుంటే.. ఇప్పుడు లీటరు ధర దాదాపు రూ.10 పెరగడం గమనార్హం. మరోవైపు వేరుశనగ, సోయాబీన్, రైస్బ్రాన్ వంటి దేశీయ నూనెల ధరల్లో పెద్దగా కదలిక లేదు. సాధారణంగా వేరుశనగ నూనె అధిక ధర పలుకుతుంటే... ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఇతర నూనెలతో పోలిస్తే తక్కువ ధరలోనే లభిస్తోంది.
సంక్రాంతి అంటేనే పిండి వంటలు, నూనెల వినియోగం ఎక్కువగా ఉండే కాలం. ఈ పెరిగిన డిమాండ్ను ఆసరాగా చేసుకుని ధరలు ఎగబాకాయన్న అభిప్రాయం వినియోగదారుల్లో బలంగా ఉంది. ధరలపై నియంత్రణ తీసుకురావాలని, నిల్వలపై పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. లేదంటే పండగ ఆనందం కంటే ధరల భారం ఎక్కువగా మిగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది












Click it and Unblock the Notifications