రోడ్లపై కొత్తిమీర నాట్లేసి .. ఏపీ రోడ్లు, భవనాల శాఖా మంత్రి ఇలాకాలో నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అద్వానంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అధికార పార్టీని టార్గెట్ చేస్తూ పలు ఆందోళనలు నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ నేతలు రహదారులపై వలలు వేసి చేపల వేట సాగించి తమ నిరసన తెలియజేశారు. జగనన్న గుంతల పథకం అంటూ జగన్ సర్కార్ పై సెటైర్లు వేసి సమరశంఖాన్ని పూరించారు. కొద్దిపాటి వర్షానికి కూడా చెరువులను తలపిస్తున్న రోడ్లను మరమ్మతులు చేయాలని, గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు.
ఇక తాజాగా అనంతపురం జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారిన పరిస్థితులపై సీపీఐ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో భారీ గుంతలతో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, పెనుగొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఇలాకాలోనే పరిస్థితి దారుణంగా ఉందని సిపిఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. పెనుగొండ నియోజకవర్గంలో, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఇలాకాలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై కొత్తిమీర నాట్లు వేసి తమ నిరసనను తెలియజేశారు.
పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి గ్రామంలో వినూత్న నిరసన చేపట్టిన సిపిఐ నాయకులు,రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నిత్యం వందల సంఖ్యలో అనంతపురం నుంచి హిందూపురం పట్టణాలకు రాకపోకలు సాగిస్తున్న రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకున్న నాథుడు లేడని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్ పాలనకు రోడ్లు సాక్ష్యాలన్నారు. ఇప్పటికైనా మంత్రి శంకర్ నారాయణ స్పందించారని, అధికారులు అద్వానంగా ఉన్న రోడ్లపై దృష్టి సారించాలని, తక్షణం మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.