ఏపీపై కరోనా పంజా .. కొత్తగా 1398 కేసులు, 9 మరణాలు , పెరుగుతున్న యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతుంది . కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. భారతదేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 1398 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు . అత్యధికంగా గుంటూరు జిల్లాలో కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు నమోదయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ రెండో వారం తర్వాత పీక్స్ కు ... శాస్త్రవేత్తల హెచ్చరిక
24 గంటల్లో 9 మంది బలి.. రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7, 234
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం తాజాగా నమోదైన 1398 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,05,946 కి చేరింది. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారికి రాష్ట్రంలో తొమ్మిది మంది బలైపోయారు. గుంటూరు , నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు , ప్రకాశం ,కడప ,కర్నూలు , విశాఖ , చిత్తూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదు మంది మరణించారు . ఇక తాజా మరణాలతో ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7, 234 కు చేరుకుంది.
గుంటూరు జిల్లాలో భారీగా నమోదైన కేసులు .. ఒక్క రోజే 273 కేసులు
ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులని చూస్తే గుంటూరు జిల్లాలో 273 ,విశాఖపట్నం జిల్లాలో 198, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణాజిల్లాలో 178 , నెల్లూరు జిల్లాలో 163 , అనంతపూర్ జిల్లాలో 36 , కర్నూలు జిల్లాలో 96, వైయస్సార్ కడప జిల్లాలో 75 , శ్రీకాకుళం జిల్లాలో 51 , ప్రకాశం జిల్లాలో 48, తూర్పు గోదావరి జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 47 , పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 9,417
గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 787 మంది బాధితులు కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,89,295 . కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 9,417గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,51,22,364 నమూనాలను పరీక్షించినట్లుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని , కరోనా కట్టడికి అందరూ కలిసి సంయుక్తంగా పోరాటం చేయాలని , బాధ్యతాయుతంగా ప్రవర్తించారని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే కష్టం అని చెప్తున్నారు.