అసలే కరోనా కష్టాలు.ఏ రోగమొచ్చినా సరే టెస్టులు , స్కానింగ్ లు..ఏపీ, తెలంగాణలో దోచుకుంటున్న డాక్టర్లు
కరోనా మహమ్మారి విజృంభణతో పనులు లేక,వ్యాపారాలు దెబ్బతిని, కొన్ని కుటుంబాలు కరోనా మహమ్మారికి బలై ఆరోగ్య , ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ లలో ఏ రోగం వచ్చినా సరే టెస్టులు, స్కానింగ్ లు , సదరు ఆసుపత్రిలోనే మందులు కొనుగోలు చేయడం వంటి వాటితో డాక్టర్లు దోచుకు తింటున్నారు.ఆసుపత్రికి వెళ్లాలంటే చేతిలో పది వేలు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయి.

ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న కొందరు వైద్యులు
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు నారాయణుడు వంటి వాడు, భగవంతుడుతో సమానం. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు. ఇది ఎవరూ కాదనలేని విషయం. కానీ కొందరు వైద్యులు ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. ఇది కాస్తంత బాధ కలిగించే అంశం. ఒకప్పుడు ఏదో పెద్ద జబ్బు చేస్తే తప్పా స్కానింగ్ వరకు వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా, అవసరమైనా లేకపోయినా టెస్టులు చేయడం, స్కానింగ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. టెస్ట్ లు, స్కానింగ్ లు, డాక్టర్ ఫీజు మాత్రమే వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

డాక్టర్ రాసిన మందులు దొరికేవి ఆ ఆస్పత్రిలోనే
ఇక డాక్టర్ చూసిన తర్వాత రాసిన ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మందులు బయట మెడికల్ షాప్ లో దొరకవు. ఆ డాక్టర్ కు సంబంధించి ఆసుపత్రిలో నిర్వహించే మెడికల్ షాప్ వాళ్లకు తప్ప బయట వారికి ఎవరికీ అర్థం కాదు. కాబట్టి చచ్చినట్టు మందులు కూడా అక్కడే కొనుగోలు చేయాలి. మందుల కంపెనీలతో టై అప్ చేసుకుంటున్న డాక్టర్లు, విపరీతమైన ధరలున్న మందులను రోగులకు వాడవలసిందిగా రాస్తున్నారు. ఇక స్కానింగ్ సెంటర్లు, టెస్టింగ్ సెంటర్ ల వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకొని వారి వద్ద నుండి కమిషన్లు దండుకుంటున్నారు.

మెడికల్ చెకప్ కు వెళ్ళినా ప్రైవేట్ వైద్యం అంటే 10 వేలు చేతిలో పట్టుకోవాల్సిందే
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఔట్ పేషెంట్ గా ఆస్పత్రికి వెళ్లినప్పటికీ పదివేల రూపాయలు చేతిలో పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల పై నియంత్రణ లేకపోవడం, టెస్టింగ్ , స్కానింగ్ చేసే డయాగ్నొస్టిక్ సెంటర్లపై ప్రభుత్వ నిఘా లేకపోవడం,ఇక ఆసుపత్రుల్లోనే యథేచ్ఛగా మందులు అమ్ముతున్నా, ప్రిస్క్రిప్షన్ లు అర్థం కాకుండా విడి అక్షరాలతో కాకుండా ఇష్టారాజ్యంగా రాస్తున్నా ప్రశ్నించే నాథుడు లేకపోవటం వారికి ఆడింది ఆట పాడింది పాటగా మారింది.

వైద్య ఆరోగ్య శాఖల పనితీరు నామమాత్రమే
జిల్లాలలో వైద్య ఆరోగ్య శాఖలు ఉన్నా వాటి పనితీరు నామమాత్రమే అన్నట్లు తయారైంది. దీంతో సామాన్యుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా జబ్బు చేస్తే ఆస్తులు తెగ నమ్ముకొని ఆసుపత్రుల వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ, వారు సరిగా చూడకపోవడం, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడం వంటి కారణాలు, వారిని ప్రైవేట్ ఆస్పత్రుల బాట పట్టిస్తున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రులలో యథేచ్ఛగా దోపిడీకి కొనసాగుతున్న తీరు మధ్య తరగతి, సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.
Recommended Video

ప్రైవేట్ ఆస్పత్రులపై , డాక్టర్ల దోపిడీపై నియంత్రణ లేదు, సామాన్యులకు వైద్యం అందని ద్రాక్ష
వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్ పెట్టాలని ప్రజలు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది. ఈ పరిస్థితులు మారకుంటే సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతుంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించటానికి ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఉన్న వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తే చాల వరకు మెరుగైన వైద్యం అందుతుందని భావిస్తున్నారు ప్రజలు.












Click it and Unblock the Notifications