కరోనా ప్రభావం .. తిరుమలలో ధన్వంతరి మహా యాగం.. టీటీడీ కీలక నిర్ణయాలివే !!
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎక్కువగా జన సమూహం ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది . ఇక కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి ఏపీలో నమోదైన కారణంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎక్కువ జన సమర్ధం ఉండే తిరుమలలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలకు ఉపక్రమించింది.
గంటకి నాలుగు వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గంటకి నాలుగు వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శనివారం కరోనా వ్యాప్తి చెందకుండా తిరుమలలో తీసుకుంటున్న చర్యలపై మీడియాతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని , తీసుకున్న నిర్ణయాలు, ఫలితాలను పున:సమీక్షించుకుంటామని పేర్కొన్నారు.
ఒంటిమిట్ట లో సీతారాముల కళ్యాణం రద్దు, ముంబై శ్రీవారి ఆలయ భూమి పూజ క్యాన్సిల్
టాస్క్ పోర్స్, కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు . క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనం, సిఆర్ ఓ కేంద్రాల వద్ద శానిటేషన్ చర్యలు చేపట్టామని, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు . ఇక కరోనా ప్రభావంతో ఒంటిమిట్ట లో సీతారాముల కళ్యాణం రద్దు చేశామని వెల్లడించారు . ఇక ముంబాయి లో శ్రీవారి ఆలయ నిర్మాణం భూమిపూజను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వేచివుండే అవసరం లేకుండా టైం స్లాట్ విధానంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
కరోనా ఉపశాంతికి తిరుమలలో ధన్వంతరి మహాయాగం
మంగళవారం నుంచి ప్రతి ఒక్క భక్తుడు టోకెన్ పోంది దర్శనం చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు మార్చి 19 నుంచి 21వ తేది వరకు శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహా యాగం నిర్వహిస్తామని పేర్కొన్నారు . యాగానికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామిజీలను ఆహ్వానిస్తామని చెప్పారు.
తిరుమలలో కరోనా వాప్తి నియంత్రణా చర్యలు
ఇక ప్రస్తుతం నిత్యం నిర్వహించే సహస్రకళషాభిషేకం, వసంతోత్సవం, విశేష పూజలను తాత్కలికంగా రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. నిత్యం రద్దీ ఉండే తిరుమలలో కరోనా వాప్తి నియంత్రణా చర్యలను చేపట్టినట్టు అనీల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఇక భక్తులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జలుబు, దగ్గు , జ్వరంతో స్వామి దర్శనానికి రావద్దని చెప్తున్నారు.