ఏపీలో కరోనా ఎఫెక్ట్ .. శ్రీశైలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో నేటి నుండి అన్నదానం నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 8 ,93,734 కేసులు నమోదు కాగా, 2188 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి . ఇప్పటివరకు కరోనా బారినుండి కోలుకున్న వారు 8,84, 357 మంది . 7,189 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.5 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ద్వారకా తిరుమలలో అన్నదానం బంద్
ఇదిలా ఉంటే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఆలయాల్లో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఏపీ దేవాదాయ శాఖ యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో , ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి కరోన ఎఫెక్ట్ ... అన్న ప్రసాద వితరణ నిలిపివేత
అన్న ప్రసాదానికి బదులుగా, భక్తులకు ప్యాకెట్స్ ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు శ్రీశైలమల్లన్న ఆలయంలోనూ కరోనా కారణంగా నేటి నుండి భక్తులకు అన్నదానం చేయడం నిలిపివేస్తున్నట్లు గా అధికార యంత్రాంగం ప్రకటించింది. కరుణ కేసులు పెరుగుతున్న దృష్ట్యా , కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా, నిత్యాన్నదాన సత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు వెల్లడించారు.
ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ .. ఆలయాల్లో కరోనా కట్టడికి దేవాదాయ శాఖ చర్యలు
మల్లన్న ఆలయంలోనూ అన్నప్రసాదాన్ని ఫుడ్ ప్యాకెట్స్ రూపంలో మల్లన్న భక్తులకు అందించాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇదే విధానం కొనసాగుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు ఆలయాల్లో మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రధాన ఆలయాల్లో సైతం కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నదాన వితరణలను ఆపివేసి ఫుడ్ ప్యాకెట్ లను అందించాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.