కరోనా వైరస్: విశాఖలో 91 మంది ఐసోలేషన్, 170 క్వారంటైన్, పెరుగుతోన్న పాజిటివ్ కేసులు..
ఢిల్లీ ఘటనతో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇందులో అధికంగా తెలుగురాష్ట్రాల నుంచి నమోదవడం టెన్షన్కు గురిచేసింది. మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 44కి చేరింది. ఒక్కరోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో మెజార్టీ ప్రజలు ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన వారే కావడం విశేషం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో 91 మంది వరకు ఐసోలేషన్లో ఉన్నారని కలెక్టర్ ప్రకటించారు.
ఐసోలేషన్లో 91 మంది
విశాఖ జిల్లాలో కరోనా వైరస్ బాధితుల వివరాలను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. జిల్లాలో 91 మంది ఐసోలేషన్ వార్డులో, 170 మంది క్వారంటైన్లో ఉన్నారని వివరించారు. చెస్ట్ ఆస్పత్రిలో 90 మంది, విమ్స్లో ఒకరికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విశాఖ సహా జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో 170 మందిని క్వారంటైన్లో ఉంచినట్టు వివరించారు. కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 215 మంది ఆస్పత్రిలో చేరగా.. 124 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు.
క్వారంటైన్లో ఉన్నది వీరే.
భీమిలో క్వారంటైన్ సెంటర్లో 55 మంది, యలమంచిలిలో 51, నర్సీపట్నంలో 15 మంది, విశాఖపట్టణంలో 45, గాజువాకలో నలుగురు క్వారంటైన్లో ఉన్నారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖ జిల్లాలో గల 26 సెంటర్లలో 4 వేల 984 ఐసోలేషన్ బెడ్లు, 53 క్వారంటైన్ సెంటర్లలో 10 వేల 973 బెడ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కరోనా కంట్రోల్రూమ్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజలు కరోనా వైరస్ గురించి మాత్రమే ఎక్కువగా అడుగుతున్నారని పేర్కొన్నారు.
పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
ఢిల్లీ నిజాముద్దీన్లో గల మర్కజ్లో మతపరమైన ప్రార్థనల కోసం తెలుగురాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభలకు ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి ప్రతినిధులు రాగా.. సభలకు హాజరైన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు చనిపోగా.. ఏపీ, తెలంగాణలో పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. సభలకు వెళ్లొచ్చిన వారిని ఇప్పటికే కొందరిని గుర్తించి క్వారంటైన్లో పెట్టగా.. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ఎవరినీ కలిశారు, వారి పరిస్థితి ఏంటీ అని భయాందోళన మాత్రం కొనసాగుతోంది.