ఏపీలో కరోనా: జగన్ దెబ్బకు గప్చుప్.. ‘టెస్టింగ్ కిట్స్’లో షాకింగ్ ట్విస్ట్.. ఒప్పందంలో ఏముందంటే..
అంతవరకు విధాన నిర్ణయాలపైనే వివాదాలే తప్ప, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ సర్కారుపై వెల్లువెత్తిన తొలి అవినీతి ఆరోపణ 'కరోనా టెస్టింగ్ కిట్స్' కొనుగోళ్లు. సౌత్ కొరియా నుంచి ఏపీ కొనుగోలు చేసిన కిట్స్ ధరలు.. ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాలు పొందిన ధరల కంటే చాలా ఎక్కువగా ఉండటంతో ఈ వ్యవహారంలో కమిషన్ల దందా చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం జగన్, ఆయన మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నేతలు సంచలన విమర్శలు చేశారు. అయితే, కిట్స్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల్ని బహిర్గతంచేస్తూ, సదరు సప్లయర్స్ కు జగన్ ప్రభుత్వం లేఖలు రాయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
అసలేం జరిగిందంటే..
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో, దాన్ని నియంత్రించేందుకు భారీ ఎత్తున టెస్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 10లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను సౌత్ కొరియా నుంచి తెప్పించాలనుకుంది. ఆ మేరకు సౌత్ కొరియాకు చెందిన ప్రఖ్యాత ‘ఎస్డీ బయోసెన్సార్'కు ఆర్డర్ పెట్టింది. ఈ ప్రక్రియలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సండూర్ మెడికెయిడ్స్' అనే సంస్థ సప్లయర్ గా వ్యవహరించింది. ఒక్కో కిట్ ధర రూ.730గా నిర్ధారించగా, తొలి విడత 2లక్షల కిట్స్ గత వారమే రాష్ట్రానికి చేరుకున్నాయి. కానీ ఇవే టెస్టింగ్ కిట్స్ ను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.337కే కొనుగోలు చేసిందన్న విషయం వెల్లడికావడంతో వివాదం మొదలైంది. కమిషన్ల కోసమే జగన్ అండ్ కో ఇలా ఎక్కువ ధరకు కిట్స్ కొనుగోలు చేసిందనే ఆరోపణలొచ్చాయి. అయితే..
క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందించిన సంస్థ కూడా అదే సౌత్ కొరియాకు చెందిన ‘ఎస్డీ బయోసెన్సార్' కావడంతో వివాదం మరింత పెద్దదైంది. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఒక్కో కిట్ రూ.1200 కొన్నారనే పుకార్లు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మిగతా రాష్ట్రాలు తక్కువ ధరకే కిట్స్ పొందడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, దీనిపై కచ్చితమైన స్పష్టత ఇస్తామన్న ప్రభుత్వం.. అప్పటిదాకా రాష్ట్రానికి హాని కలిగించే రీతిలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని, అలా చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటామని విమర్శకుల్ని హెచ్చరించింది. చెప్పిన ప్రకారం..
ఆ ఒప్పందంలో ఏముందంటే..
ఇతర రాష్ట్రాలు తక్కువ ధరకే కిట్స్ పొందాయని నిర్ధారణ కావడంతో ఏపీ ప్రభుత్వం.. కిట్స్ సప్లయర్ గా ఉన్న ‘సండూర్ మెడికెయిడ్స్' సంస్థకు ఓ ఘాటు లేఖ రాసింది. ‘‘ఎస్డీ బయోసెన్సార్ తయారు చేసిన కిట్స్ వేరే రాష్ట్రంలో తక్కువ ధరకు సరఫరా అయినట్లు తెలిస్తే, ఏపీకి కూడా అదే కనిష్ట ధరకు వాటిని(కిట్స్ని) ఇవ్వాల్సి ఉంటుంది''అని కొనుగోలు ఒప్పందంలో రాసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుచేసింది. ఈ మేరకు ‘మేం కూడా రూ.730 కాకుండా, ఛత్తీస్గఢ్ ధర(రూ.337) మాత్రమే చెల్లిస్తాం''అని స్పష్టం చేసింది. ఏపీ లేఖపై సండూర్, ఎస్ డీ సంస్థలు ఇంకా స్పందించాల్సిఉంది.
అంతా సైలెంటైపోయారు..
కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోళ్ల విషయంలో వెల్లువెత్తిన విమర్శలకు సూటిగా, ఘాటుగా సమాధానం చెప్పాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ప్రతి విషయంలో పారదర్శకత పాటిస్తామన్న ఆయన.. కిట్స్ కొనుగోలు ఒప్పంద పత్రాలను బహిర్గత పర్చడంతో అంతా గప్ చుప్ అయిపోయారు. పైగా, కిట్స్ కొన్నాం కాబట్టి భారం మోయాల్సిన పనిలేకుండా, ధరల్లో తేడాల గురించి ఒప్పందంలో ముందే జాగ్రత్త వహించామని తన చర్యలతో సీఎం తేటతెల్లం చేశారు. ఇప్పటికే కరోనా నియంత్రణ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇప్పుడీ క్లారిటీతో తాను పారదర్శకంగానే వ్యవహరిస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ..
వివాదం ముగిసినట్లేనా?
సీఎం జగన్ ఎంతగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ప్రతిపక్ష నేతలు మళ్లీ విమర్శలకు దిగుతూనే ఉన్నారు. ఒకవేళ ఛత్తీస్గఢ్ ధరల వ్యవహారం బయటికి రాకుండా ఉంటే, ఏపీ ప్రజాధనం వృధా అయి ఉండేదనే వాదన వినిపిస్తోంది. పైగా, వేరే రాష్ట్రాలు కొన్న కిట్స్ కు, ఏపీ కొనుగోలు చేసినవాటికి తేడాలున్నాయని, ఇవి హై ఎండ్ కిట్స్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడం విమర్శలకు తావిచ్చినట్లయింది. టీడీపీ కంటే బీజేపీ ఈ అంశాన్ని హైలైట్ చేస్తుండటంతో కాషాయ నేతలు, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
ఏపీలో ఇదీ సీన్..
సోమవారం మధ్యాహ్నం నాటికి రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో కొవిడ్-19 కేసుల సంఖ్య 722కు పెరిగాయి. అందులో 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75 కొత్త కేసులు రావడం గమనార్హం. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 174 కేసులు నమోదయ్యాయి.
Recommended Video