ఏపీకి ఆగిన విదేశీయుల రాక - ఊపిరిపీల్చుకున్న అధికారులు- త్వరలో పరిస్ధితి అదుపులోకి..
ఏపీలోకి విదేశీయుల రాక ప్రారంభం అవగానే కరోనా బాధితుల సంఖ్య కూడా మొదలైంది. ముఖ్యంగా యూరప్, గల్ఫ్, అమెరికా దేశాల నుంచి వచ్చిన విదేశీయుల కారణంగానే ఏపీలో ఇప్పటివరకూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వీరి నుంచి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యువకు ఈ వైరస్ పాకింది. అయితే గత రెండు రోజులుగా ఏపీకి విదేశీయుల రాక అస్సలు లేదని తాజాగా వెలువడిన హెల్త్ బులిటెన్ల ద్వారా నిర్ధారణ అవుతోంది. దీంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఏపీలో విదేశీయుల రాక..
ఏపీలో రెండు వారాలుగా సాగుతున్న విదేశీ ప్రయాణికుల రాకతో పాటే కరోనా వైరస్ కేసుల నమోదు కూడా మొదలైంది. రెండు వారాలుగా దాదాపు 30 వేల మంది విదేశీ ప్రయాణికులు వివిధ మార్గాల్లో ఏపీకి చేరుకున్నారు. వీరి ద్వారానే ఇప్పటి వరకూ ఏపీలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వీరి నుంచి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకూ వైరస్ పాకింది. దీంతో వీరందరినీ ప్రస్తుత క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజులుగా తగ్గిన రాక..
ఏపీలో మొన్నటి వరకూ వచ్చిన విదేశీ ప్రయాణికుల సంఖ్య 29672. ఇవాళ్టి వరకూ ఇది మరింత పెరగలేదు. దీంతో విదేశీ ప్రయాణికుల సంఖ్యను పూర్తిస్దాయిలో ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చినట్లు అర్ధమవుతోంది. వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా ఇప్పటివరకూ రాష్ట్రానికి చేరుకున్న విదేశీ ప్రయాణికులను సైతం ప్రభుత్వం క్వారంటైన్ కు పంపింది. ఇక రాష్ట్రానికి నేరుగా వచ్చే వారు కూడా నిలిచిపోవడంతో వీరి సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఫలించిన వాలంటీర్ల ప్రయత్నం..
ఏపీలోకి వివిధ మార్గాల ద్వారా ప్రవేశించి ప్రభుత్వానికి వివరాలు ఇవ్వని వారు, అలాగే విమానాశ్రయాలకు వచ్చి క్వారంటైన్ లో పెట్టాక తప్పించుకున్న వారిని గుర్తించేందుకు వాలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇందులో పలువురు తప్పించుకుని తిరుగుతున్న విదేశీ ప్రయాణికులను గుర్తించి కేసులు కూడా నమోదు చేశారు. వీరిలో చాలా మందిని తిరిగి క్వారంటైన్ కు పంపారు. వీరంతా ఇప్పుడు ఆస్పత్రుల్లోనో, హోమ్ క్వారంటైన్లలోనో ఉన్నారు.

విదేశీయుల లెక్క తేలడంతో...
ప్రస్తుతం ఏపీలోకి వచ్చిన విదేశీ ప్రయాణికుల సంఖ్య తేలడంతో ఇప్పుడు వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరి లెక్క కూడా తేలిపోతే ఇక రాష్ట్రంలో కరోనా బాధితుల తుది లెక్కను నిర్ధారించే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత వారికి చికిత్స అందించాక కోలుకుంటే ఇక రాష్ట్రంలో కరోనా కేసులను పూర్తిగా నియంత్రించినట్లు అవుతుంది. ఈ దిశగా అధికారులు శ్రమిస్తున్నారు.












Click it and Unblock the Notifications