కరోనావైరస్: 18 రాష్ట్రాల్లో 85 శాతానికిపైగా రికవరీ, ఏపీ సహా ఆ రాష్ట్రాల్లో 90శాతానికిపైగా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ రేటు కూడా పెరుగుతుండటం గమనార్హం. గత వారం పది రోజులుగా దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్యే భారీగా ఉంటోంది. అంతేగాక, మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. జాతీయ రికవరీ రేటు కంటే కూడా పలు రాష్ట్రాలు ఎక్కువ రికవరీ రేటును నమోదు చేస్తుండటం గమనార్హం.

దేశంలో 72వేల కొత్త కేసులు..
తాజాగా, బుధవారం దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 85.02 శాతంగా నమోదైంది. దేశంలో గత 24 గంటల్లో దాదాపు 12 లక్షల నమూనాలను పరీక్షించగా.. 72వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67,57,131కి చేరింది. వీరిలో 57,44,693 మంది కోలుకోగా, 1,04,555 మంది మరణించారు.

ఆ 18 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ..
ప్రస్తుతం దేశంలో 9,07,883 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 8,22,71,654 నమూనాలను పరీక్షించారు. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. కాగా, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే ఎక్కువ రికవరీ రేటును నమోదు చేశాయి.

ఏపీ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 90శాతానికిపైగా రికవరీ..
కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలో 96.07 శాతంగా రికవరీ రేటు ఉండగా, అండమాన్ నికోబార్ దీవుల్లో 94 శాతం, బీహార్లో 93.5 శాతం, ఆంధ్రప్రదేశ్లో 92.2 శాతం, తమిళనాడులో 91.2 శాతం, హర్యానా 90.6 శాతం, ఢిల్లీలో 90.4 శాతం, ఒడిశాలో 88.3 శాతం, యూపీ 88.1 శాతం, పశ్చిమబెంగాల్లో 88 శాతం, జార్ఖండ్లో 87.9 శాతం, మిజోరాం 87.8 శాతం, పంజాబ్ 87 శాతం, ఛండీగఢ్ 86.8 శాతం, తెలంగాణలో 86.5 శాతం, గుజరాత్లో 86.2 శాతం, గోవాలో 85.7 శాతం, మధ్యప్రదేశ్లో 85.1 శాతంగా నమోదైంది.
Recommended Video

ఆ పది రాష్ట్రాల్లోనే కేసులు.. రికవరీ..
కాగా, మంగళవారం ఒక్కరోజులోనే 72,049 కొత్త కేసులు నమోదవ్వగా, వాటిలో 78 శాతం పది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలోనే 12 వేలకు పైగా కొత్త కేసులు రాగా, కర్ణాటకలో దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల విషయానికొస్తే మంగళవారం 986 మంది ప్రాణాలు కోల్పోగా, 83 శాతం మరణాలు పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 370 మంది కరోనాతో మరణించారు. కర్ణాటకలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల కంటే రికవరీ.. 6.32 రేట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లోనే 75 శాతానికిపైగా రికవరీ కేసులు నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications