క్షణం..క్షణం..అదే ఉత్కంఠ: అవకాశం లేదు.. విచక్షణాధికారంతో: ఛైర్మన్ ఉద్వేగభరితం!
ఏపీ ప్రభుత్వం శాసనసభలో తాము అనుకున్న విధంగా..బిల్లులను ఆమోదం పొందటంతో.. మండలిలో బిల్లుల ప్రతిపాదనకు ముందుకొచ్చింది. మండలిలో టీడీపీకి మెజార్టీతో ఉండటంతో ప్రభుత్వం తొలి నుండి బిల్లుల ఆమోదం పైన సందేహాంగానే కనిపించింది. అయితే, ఒక వేళ మండలిలో బిల్లు తిరస్కరించినా..తిరిగి శాసనసభలో ఆమోదం తీసుకోవచ్చనే అంచనాతో ఉన్నారు. కానీ, మండలిలో బిల్లులను ప్రతిపాదించే సమయం నుండి చివరకు ఛైర్మన్ నిర్ణయం వరకు టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అధికారపక్షం గట్టిగా నిలువరించే ప్రయత్నం చేసినా..చివరకు ఛైర్మన్ నిర్ణయం మాత్రం మింగుడు పడ కుండా మారింది. మండలి ఛైర్మన్ నిర్ణయం పైన చివరి నిమిషం వరకు టెన్షన్ నెలకొంది. అయితే, తీర్పుకు ముందు ఛైర్మన్ ఉద్వేగంతో కనిపించారు. గద్దత స్వరంతో నిర్ణయం ప్రకటించారు. బిల్లులను సెలక్టు కమిటీకి పంపించే పరిస్థితి లేదంటూనే..తనకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుంటున్నానంటూ ప్రకటన చేసారు. అదే..మొత్తంగా సంచలనంగా మారింది.

తీర్పు సమయంలో ఉద్వేగంతో..
మండలిలో రెండు బిల్లుల పైన చర్చ ముగిసింది. ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇక, ఛైర్మన్ దీని పైన రూలింగ్ కు సిద్దమవుతున్న సమయంలో..యనమల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసారు. ఆ సమయంలో తీవ్ర గందరగోళం జరిగింది. సభను వాయిదా వేసిన సభలోని అన్ని పక్షాల నేతలతో సమావేశమయ్యారు. గంటన్నార తరువాత తిరిగి సభను సమావేశపరిచారు. గ్యాలరీలు మొత్తం అధికా ర ..ప్రతిపక్ష పార్టీల నేతలతో కిక్కిరిసిపోయాయి. ఛైర్మన్ షరీఫ్ తన నిర్ణయాన్ని చదవటం ప్రారంభించారు. సభలోకి బిల్లులు వచ్చిన సమయం నుండి చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. అందులో భాగంగా.. సభా వ్యవహారాల కమిటీ అజెండా ప్రకారం అనుకోకుండా నిబంధన 71 కింద తీర్మాన ప్రతిపాదన వచ్చిన విషయాన్ని వివరించారు. తర్జనభర్జనల అనంతరం.. ప్రభుత్వం, సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకున్నాం. నిబంధన 71 కింద చర్చతో పాటు ప్రభుత్వ బిల్లులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షం లేఖ ఇచ్చినా...
ఆ సమయంలో బిల్లుకు సవరణల విషయం, సెలక్టు కమిటీకి పంపే విషయమూ ప్రస్తావనకు రాలేదన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు ఈ రెండు అంశాలపై తనకు లేఖ పంపారని స్పష్టం చేసారు. అవి పంపడం ఆలస్యమైందని అంగీకరించారు. ప్రతిపాదన ఇచ్చామనే ఆలోచనతో వారు ఉన్నా ఆ విషయం రికార్డులకు ఎక్కలేదన్నారు. బిల్లుపై చర్చ అనంతరం ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఈ బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని అడిగారని.. సకాలంలో అది రాలేదని.. ఆ సవరణ తీర్మానాన్ని చేపట్టలేదని..సాంకేతికంగా నిబంధనల ప్రకారం అది జరగలేదని అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ ఛైర్ నుండి చెప్పుకొచ్చారు.ఈ అంశాలపై రెండున్నర గంటలపాటు వివిధ పక్షాల నేతలతో చర్చించానని వివరించారు. ప్రతిపక్ష తెదేపా తాము సవరణ తీర్మానాలు ఇచ్చామని, తమ వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదని,..వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కోరిందని చర్చల సారాంశాన్ని వివరించారు.

సెలెక్ట్ కమిటీకి పంపించలేము..కానీ,
ఛైర్మన్ షరీఫ్ తన నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఆ తరువాత విమర్శలకు కారణమయ్యాయి. నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అధికారపక్షం చెప్పిందని... బిల్లు చేపట్టిన 12 గంటల్లోపు సవరణ ఇవ్వడం, అది పరిగణనలోకి తీసుకోవడం జరగలేదని అంగీకరించారు. నిబంధనల ప్రకారం రాని ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకూడదని భాజపా, పీడీఎఫ్ నాయకులు అభిప్రాయపడ్డారని సభ్యులకు చెప్పారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి..దేనికి మొగ్గు చూపాలి.. ఎలాంటి రూలింగు ఇవ్వాలని ఆలోచించామని... ఇప్పటికే కాలాతీతమైందని చెప్పుకొచ్చారు. ఆలోచనలతో కాలయాపన సరికాదనేది తన ఉద్దేశమని స్పష్టం చేసారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల బిల్లులను సెలక్టు కమిటీకి పంపించే పరిస్థితి లేదని తేల్చారు. దీంతో..అధికార పక్షంలో హర్షం వ్యక్తం అయింది. దీనికి కొనసాగింపుగా.. అందువల్ల తనకు ఛైర్మన్గా ఉన్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుంటున్నానంటూ... నిబంధన 154 ప్రకారం ఈ 2 బిల్లులను సెలక్టు కమిటీకి పంపిస్తున్నాని ఛైర్మన్ ప్రకటించారు...ఆ సమయంలో ఆయన ఉద్వేగంతో మాట్లాడినట్లుగా స్పష్టమైంది. ఆ తరువాత విమర్శలు..ప్రశంసలు అన్నీ మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications