ఏపీలో నాలుగు రోజుల్లో ఉచిత బస్సు..! ఆటో డ్రైవర్లకు షాక్ తప్పదా ..?
ఏపీలో మరో నాలుగు రోజుల్లోకూటమి సర్కార్ తమ సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతోంది. స్త్రీశక్తి పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు పంద్రాగస్టు వేడుకల తర్వాత తన కుమారుడు నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు.
అయితే మహిళలకు ఉచిత బస్సులు అందుబాటులోకి రాగానే వెంటనే మొదలయ్యే సమస్య ఆటో డ్రైవర్లకు గిరాకీలు లేకపోవడం. ఇప్పటికే పలు సమస్యలతో అల్లాడుతున్న ఆటో డ్రైవర్లపై ఇప్పుడు ఉచిత బస్సు పథకం రూపంలో మరో పిడుగు పడబోతోంది. దీంతో ఈ పథకం ద్వారా నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు గొంతెత్తుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఆటో యూనియన్లు.. తాజాగా చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పరిహారంపై ప్రకటన చేయాలని కోరుతున్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఆటో డ్రైవర్లకు కచ్చితంగా పరిహారం ఇస్తారా లేదా అంటే చెప్పే పరిస్దితి లేదు. ఎందుకంటే ప్రభుత్వ స్ధాయిలో అధికారికంగా దీనిపై నిర్ణయం ఇప్పటివరకూ తీసుకోలేదు. కేవలం రాజకీయ సభల్లో సీఎం, మంత్రుల ప్రకటనలు మినహా అధికారికంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చే పరిహారంపై తేల్చలేదు. దీంతో ఉచిత బస్సు పథకం మొదలు కాగానే ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10 వేల చొప్పున వాహనమిత్ర పథకం కింద ఇచ్చేవారు. ఈ మొత్తంతో ఆటో రిపేర్లు, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు తీరేవి. కాబట్టి ఇప్పుడు ఆ 10 వేలు అయినా ఇవ్వాలని ఆటో డ్రైవర్లు కూటమి సర్కార్ ను కోరుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. అయితే ఉచిత బస్సు పథకం ప్రారంభానికి నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో అధికారిక నిర్ణయం మాత్రం వెలువడలేదు. దీంతో ఆటో డ్రైవర్లలో ఆందోళన పెరుగుతోంది.












Click it and Unblock the Notifications