కరోనాతో ఏపీ సచివాలయం విలవిల- 11న కేబినెట్ భేటీ- వర్క్ ఫ్రం హోం కోరుతున్న ఉద్యోగులు..
ఏపీ సచివాలయంలో కరోనా భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో మూడు, నాలుగు బ్లాక్ లు మూసేసిన అధికారులు.... వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితులను కోవిడ్ ఆస్పత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎంవో ఉండే బ్లాక్ 1లో ఓ ఉద్యోగికి కరోనా ఉన్నట్లు తేలడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టులో లేటెస్ట్ పిటీషన్: దాన్ని అడ్డుకోవాలంటూ: నేడో, రేపో
సచివాలయంలో కరోనా....
ఏపీ సచివాలయాన్ని కరోనా వైరస్ భయాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే మూడు, నాలుగు బ్లాక్ లలో పనిచేస్తున్న ముగ్గురు వ్యవసాయశాఖ ఉద్యోగులకు కరోనా సోకడంతో వారిని కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఒకరి రూమ్ మేట్ అయిన సాధారణ పరిపాలనాశాఖ ఉద్యోగికి కూడా తాజాగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కేవలం సచివాలయంలోనే నలుగురు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు తేలింది. వీరితో పాటు అసెంబ్లీ గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్న మరో కానిస్టేబుల్ కు కూడా కరోనా ఉన్నట్లు తేలింది.
విస్తృతంగా పరీక్షలు...
సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో కలిపి మొత్తం ఐదుగురు ఉద్యోగులకు కరోనా నిర్దారణ కావడంతో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వణికిపోతున్నారు. విధుల్లోకి రాలేమని అధికారులకు ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సచివాయంలో ఉద్యోగులందరికీ విడతల వారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయితే కానీ వాస్తవ పరిస్ధితి ఏంటో తెలిసే అవకాశం లేదు.
వర్క్ ఫ్రం హోం కోరుతున్న ఉద్యోగులు..
కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల సాయంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో సచివాలయంలో విధులకు రాలేమని వారు చెప్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే లాంగ్ లీవ్ తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో ఈ పరిస్ధితి నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
11 న కేబినెట్ భేటీపై ఉత్కంఠ....
ఈ నెల 11న సచివాలయం బ్లాక్ 1లో ఏపీ కేబినెట్ నిర్వహించేందుకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఆరు రోజుల్లో కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో సచివాలయంలో పరిస్ధితులను చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అయితే కరోనా లక్షణాలు ఇంకా బయటపడని వారు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో వీరు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వారం రోజుల్లో కొత్తగా కేసులేవీ రాకపోతే కేబినెట్ భేటీ సజావుగా సాగే అవకాశముంటుంది. లేకపోతే కేబినెట్ వేదిక కూడా మార్చాల్చి రావచ్చని ప్రభుత్వ వర్గాలు అనధికారింగా వ్యాఖ్యానిస్తున్నాయి.