ఏపీలో కరోనా: ఆగని మరణాలు -కొత్తగా 3,175 కేసులు, 29 మంది మృతి -ఉభయ గోదావరిలో అదే తీరు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ఇంకా కొనసాగుతున్నది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రికవరీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొత్త కేసుల ఉధృతి ఇంకా తగ్గలేదు. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం.. 24 గంటల్లో 94,595 శాంపిళ్లను పరీక్షించగా, 3,175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొత్తవాటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19లక్షల మార్కును దాటి, 19,02,923కు పెరిగింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 662 కొత్త కేసులు, చిత్తూరులో 473, పశ్చిమ గోదావరిలో 398 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు వచ్చాయి.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 12,844కు పెరిగింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, అనంతపూర్ జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,692 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 18,54,754కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,325గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,23,63,078 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.












Click it and Unblock the Notifications