జగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10thకూ మార్కులు
ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగానికి సంబంధించి ఇప్పటికే పలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన జగన్ సర్కారు ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానాన్నీ అమలు చేయాలని భావిస్తున్నది. కొత్త పాలసీలో చదువులు, బడుల గతిని సమూలంగా మార్చేసేలా సంచలన విధానాలను రూపొందించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొవిడ్ కారణంగా మూతపడిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి పున:ప్రారంభించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం 'నాడు నేడు' కార్యక్రమం, అంగన్వాడీలపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. వివరాలివి..

16 నుంచి ఫిజికల్ క్లాసులు
రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి అన్ని రకాల స్కూళ్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే బడులను నడుపుతామని, దీనికి సంబంధించి ఇప్పటికే టీచర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్లు వేయించే ఏర్పాట్లు కూడా చేశామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు తెలిపారు. అదే రోజు..

నాడు-నేడు ప్రజలకు అంకితం
స్కూళ్లు రీఓపెన్ అయ్యే ఆగస్టు 16నే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని, అదే రోజు రెండో విడత 'నాడు నేడు'పనులకు శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 'నాడు-నేడు పనుల్లో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని, పనులపై చిన్న వివాదం కూడా రాకూడదని అధికారులతో జగన్ అన్నారు. స్కూళ్ల రీఓపెనింగ్, నాడు-నేడుతోపాటే రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యా విధానం గురించి కూడా ఆగస్టు 16నే ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు.

ఇకపై ఏపీలో 6రకాల స్కూళ్లు..
ఏపీలో అమలుకానున్న నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించారు. పీపీ-1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్ ఉంటాయి. 1)శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ ( పీపీ-1, పీపీ-2), 2)పౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు), 3)పౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు), 4)ప్రీహైస్కూల్స్ (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు), 5)హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకూ), 6)హైస్కూల్ ప్లస్ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని సీఎం జగన్ తెలిపారు. శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయని, అక్కడి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభం అవుతుందని, అక్కడ ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారని, కిలోమీటరు లోపలే పౌండేషన్ స్కూల్, మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుందని సీఎం వివరించారు.

పీజీ టీచర్లతో పిల్లలకు బోధన
ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం నూతన విధానంలో ప్రధాన లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. కొత్త విధానంలో 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నామని, తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుందని, విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నామని, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారని సీఎం తెలిపారు. పౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. నాడు - నేడు, నూతన విద్యావిధానంకోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని, దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలు స్పష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆగష్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Recommended Video


గతేడాది 10 తరగతికి మార్కులు
కరోనా విలయం కారణంగా వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్చేసిన నేపథ్యంలో కొన్ని రిక్రూట్మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని అధికారులు ప్రస్తావించగా, 2020 టెన్త్ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నన్నారు. స్లిప్టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇవ్వాలని, మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications