కరోనా: చంద్రబాబుకు శాశ్వత లాక్డౌన్.. దుమ్మురేపుతోన్న సీఎం జగన్.. అన్నింటా ఏపీనే టాపన్న ఎంపీ..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం లెక్కల్ని దాచిపెడుతోందన్న ప్రతిపక్ష టీడీపీ.. కేంద్ర బృందం పర్యటనపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ దాచిపెడుతోన్న వాస్తవాల్ని నిగ్గుతీయడానికే కేంద్ర బృందం సోమవారం(మే4న) ఏపీలో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ చెప్పింది. అయితే టీడీపీ విమర్శల్లో ఇసుమంతైనా నిజం లేదని, కరోనా నివారణకు సంబంధించిన అన్ని విషయాల్లో ఏపీనే టాప్ లో ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.
యువ సీఎం రోల్ మోడల్..
ఆదివారం ఉదయం నాటికి ఏపీలో దాదాపు 1.5లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 1583 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అందులో 488 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1062గా ఉన్నాయి. టెస్టులతోపాటే కేసుల సంఖ్యా పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని, వెంటిలేటర్లు, క్వారంటైన్ సెంటర్లు, ICUబెడ్ల ఏర్పాటులోనే ఏపీనే అగ్రగామిగా నిలిచిందని, అత్యవసర వైద్య బృందాలను ఎక్కడికైనా పంపించే సామర్థ్యాన్ని కూడా సాధించామని, తద్వారా యువ సీఎం జగన్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపారని గుర్తుచేశారు.
చంద్రబాబు జీవితమంతే..
కరోనా నియంత్రణ చర్యల్లో సీఎం జగన్ దుమ్మురేపుతున్నారన్న ఎంపీ విజయసాయి.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యువ సీఎం జగన్ గెలిచి ఏడాది కూడా పూర్తికాకముందే తనేంటో నిరూపించుకున్నాడని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే జగన్ వ్యక్తిత్వం ముందు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వెలవెలబోతున్నారని ఎద్దేవా చేశారు. అనుకూల మీడియా ఎగరేసి ముద్దాడుతున్నా చద్రబాబుకు ప్రయోజనం కలగట్లేదని, ఎన్నికల్లో ఓడిపోయి 11 నెలలు గడిచినా బాబు ఇంకా నేలకు దిగి రాలేకపోతున్నాడని, కొన్ని జీవితాలంతే ఉంటాయని ఎంపీ విమర్శించారు.
శాశ్వత లాక్డౌన్ తప్పదు..
నారా లోకేశ్ను పప్పుగా, చంద్రబాబును తుప్పుగా అభివర్ణించిన విజయసాయి.. ‘‘మై డియర్ పప్పూ అండ్ తుప్పూ.. భౌతిక దూరం పాటించడం అంటే... భౌతికంగా (రాష్ట్రానికి) దూరం కావటం కాదు.. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్లు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికింది. ప్రవాసంలో ఉన్న తుప్పు, పప్పులకిది చక్కని అవకాశం. లాక్ డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా ఏపీలో అడుగుపెట్టేది లేదంటే ఇక మీరు శాశ్వతంగా హైదరాబాద్ లోనే ఉండి పోవాల్సి వస్తుంది. మీ ఇష్టం..''అంటూ సెటైర్లు వేశారు.
అగ్రదేశాలకు ధీటుగా..
కరోనా వైరస్ వంటి విపత్తులను ఎదుర్కోవడానికి హెల్త్ సెక్టార్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చుకోవాలన్న సీఎం జగన్.. అన్ని గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుచేసి, వాటిలో టెలీ మెడిసిన్ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని గతంలో ఆదేశించడం తెలిసిందే. కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇంకా తప్పటడుగుల దశలో ఉన్న టెలిమెడిసిన్ ను ఏపీలో పల్లెబాట పట్టించిన ఘనత సీఎం జగన్ దేనని, డా.వైఎస్సార్ టెలిమెడిసిన్ పేరుతో మార్చిలో మొదలైన కార్యక్రమం సూపర్ హిట్ అయిందని, దేశంలో కొన్ని వైద్య సంస్థలకే పరిమితమైన ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో విస్తరించింది ఏపీనే అని విజయసాయి వివరించారు.