ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా: రామకృష్ణ
కాకినాడ/ అనంతపురం: పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే గంటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని సిపిఐ నేత రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర సోమవారం తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది.
ఈ సందర్భంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో పది రూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ర్టాన్ని పట్టించుకోవటం లేద ని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11వ తేదీన రాష్ట్ర బంద్ చేపట్టనున్నట్లు రామకృష్ణ వివరించారు.
ఇదిలావుంటే, హంద్రీ-నీవా, గాలేరి- నగరి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో టీడీపీ సర్కారు వ్యాపారం చేస్తుందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మొదటి ముద్దాయి బిజెపి అని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు మానుకోవాలని ఆయన మధు కోరారు.