చిరంజీవి ఊసరవెల్లి, పవన్ కళ్యాణ్ ల్యాండ్ మైన్; రాష్ట్రపతి ఎన్నికలపైనా సీపీఐ నారాయణ సంచలనం!!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ రాజకీయ పార్టీల నాయకులు ఎన్డీయేకు మద్దతు ఇవ్వటంపై నారాయణ మండిపడ్డారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ చిరంజీవి ఊసరవెల్లి అంటూ, పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్ మైన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసిన సమయంలో నటుడు సూపర్ స్టార్ కృష్ణను వేదిక మీదకు తీసుకువచ్చి ఉంటే బాగుండేదని, కానీ అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్ మైన్ వంటివారిని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలీదు అంటూ ఎద్దేవా చేశారు.

ఏపీకి కేంద్రం చేసింది జీరో అయినా ఎన్డీయే అభ్యర్థికి ఎందుకు ఓటేస్తున్నారు? నారాయణ ప్రశ్న
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసింది శూన్యమని, అలాంటి సమయంలో రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ, టీడీపీలతో సహా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిని ఏపీలోని అన్ని పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అంటూ సీపీఐ నారాయణ నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ నేతల బ్లాక్మెయిలింగ్ లకు ఏపీలో నేతలు భయపడుతున్నారు అంటూ సిపిఐ నారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రాజధాని అనే భావనను వైసిపి పోగొడుతుందని మండిపడ్డారు సిపిఐ నారాయణ.

ఏపీకి రాజధాని కావాలన్న ఆలోచన వైసీపీ సర్కార్ కు లేదు
వైసీపీ నేతలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ ను రాజధానిగా భావిస్తున్నారు అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రాజధాని కావాలన్న ఆలోచన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని నారాయణ ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రాకుండా చూడాలని సిపిఐ నేత నారాయణ సలహా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై జనసేన చేస్తున్న నిరసనలు స్వాగతించిన నారాయణ, ఏపీ ప్రభుత్వం వరదల భీభత్సాన్ని అంచనా వేయడంలో విఫలమైందని విమర్శించారు.

ఏపీలో వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం: నారాయణ ఫైర్
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం తో ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయని నారాయణ విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వానికి వరద అంచనా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications