రాష్ట్ర రాజధాని బతుకు చివరకు బస్టాండ్ అయింది ..ఎలాగో చెప్పిన సీపీఐ నేత రామకృష్ణ
రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగాలని సీపీఐ నేత రామకృష్ణ రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తున్నారు. అటు పార్టీలో కొందరు నేతలు మూడు రాజధానులకు తమ మద్దతు తెలియజేస్తున్నా ఆయన మాత్రంఅమరావతి రైతుల కోసమే పోరాటం సాగిస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇక రాజధానిపై వేసిన కమిటీలు ఇస్తున్న రిపోర్టులపై ఆయన విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపైన, ఈ రెండు నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీపైనా విమర్శలు చేశారు. హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్ లో భేటీ అవుతోందని, రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం చేస్తుందని రైతులను ఇబ్బంది పెడుతోందని రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో అమరావతి రైతులు వీధులపాలయ్యారని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని ఆయన మరోమారు స్పష్టం చేశారు. కొందరు విబేధించినంత మాత్రాన పార్టీ నిర్ణయం మారదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులపరంగా పాలనా వికేంద్రీకరణ జరగాలని అయితే, జగన్ చెబుతున్న పాలనా వికేంద్రీకరణ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రాజధాని మార్పు అంశంపై ఎవరితో సీఎం జగన్ చర్చించారని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న రాజధానిని కాదని మళ్ళీ రాజధాని ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచన తప్పని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications