పవన్ కళ్యాణ్ ఎక్కడ: రామకృష్ణ, పురంధేశ్వరిపై హీరో శివాజీ అసహనం
గుంటూరు: ఎవరు మాట తప్పినా ప్రజల తరఫున తానే మొదట ప్రశ్నిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి బిజెపి, టిడిపిలకు మధ్దతు పలికిన జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. ఎపికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గుంటూరులో దీక్ష చేస్తున్న సినీ నటుడు శివాజీకి ఆయన సోమవారం సంఘీభావం ప్రకటించారు. శివాజీ దీక్షా శిబిరానికి రామకృష్ణతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా వచ్చారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే బిజెపి నాయకురాలు పురంధేశ్వరికి శివాజీని విమర్శించే అర్హత లేదని రామకృష్ణ అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శివాజీ పార్టీలోనే ఉండి ఆ పార్టీపైనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడం అభినందనీయమని హర్షకుమార్ అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా మద్దతు ఇస్తామని రామకృష్ణ చెప్పారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం, ప్రత్యేక హోదా కల్పించడం వంటి అంశాలపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరిగి ఆమోదం లభించిందని ఆయన గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే, కాదు పదేళ్లపాటు అవసరమన్న అప్పటి బిజెపి ఎంపి వెంకయ్యనాయుడు తనవల్లే ఏపీకి న్యాయం జరిగిందని ప్రచారం చేసుకుని పుస్తకాలు ముద్రించుకుని పంపిణీ చేశారన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
తనకు బిజెపి సభ్యత్వం లేదని కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి అనడంపై శివాజీ అసహనం వ్యక్తం చేశారు. ఇది బిజెపి సమస్య కాదని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.