బ్రహ్మచారి మోడీకి జగన్ లవ్ లెటర్స్- హరిబాబు గవర్నర్ వదులుకో- సీపీఐ నారాయణ కామెంట్స్
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం కాకరేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కార్మికులు తుది పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం ప్రకటించిన సీపీఐ జాతీయ నేత నారాయణ.. వైఎస్ జగన్, చంద్రబాబు, ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు జగన్, బాబు రోడ్లపైకి రావాలని నారాయణ కోరారు.
వైజాగ్ స్టీల్ పోరుకు నారాయణ సంఘీభావం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఈ ప్రతిష్టాత్మక సంస్ధను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు ముందుకు కదులుతున్నాయి. ఇదే క్రమంలో సీపీఐ ఆధ్వర్యంలో కార్మికులు సాగిస్తున్న పోరాటానికి జాతీయ నేత నారాయణ సంఘీభావం ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరును పతాక స్ధాయికి తీసుకెళ్లేందుకు నారాయణ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగస్వాములు కావాలని జగన్, చంద్రబాబుల్ని ఆహ్వానించారు.
భార్యను వదిలేసిన మోడీకి జగన్ ప్రేమ లేఖలా ?
స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేయాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు. సీఎం జగన్ లేఖలు రాసినంత మాత్రాన ప్రధాని మోడీ స్పందించరని నారాయణ అన్నారు. భార్యను వదిలిపెట్టిన మోడీ.. మీరు రాసే ప్రేమ లేఖలకు ఎళా స్పందిస్తాైరని నారాయణ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖల్ని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నారాయణ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వైజాగ్ స్టీల్ పై ప్రత్యక్ష పోరాటంలోకి జగన్, చంద్రబాబు
వైజాగ్ స్టీల్ ను కాపాడుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు.
తమిళనాడు లో కేంద్రం నిర్ణయాలు విరుద్దంగా ఉంటే ప్రభుత్వ మే సంపూర్ణ బంద్ చేస్తుందని నారాయణ గుర్తు చేశారు. ఏపీలో ఆ పరిస్ధితి లేదన్నారు. చంద్రబాబు సీఎం జగన్ ఇద్దరు ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని నారాయణ కోరారు. సీఎం జగన్ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న విజయవాడలో అఖిల పక్షల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణ రుపోందిస్తామని నారాయణ ప్రకటించారు.
హరిబాబు గవర్నర్ పదవి తిరస్కరించాల్సిందే
మిజోరం గవర్నర్ గా బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియామకం అయితే సంబరాలు చేస్తున్నారని నారాయణ ఆక్షేపించారు. ఇక్కడ హరిబాబు పాపం చేస్తే మిజోరం లో పుణ్యం వస్తుందా అని ప్రశ్నించారు. విశాఖలో పుట్టి విశాఖలో ఎదిగి ఉన్నతంగా నిలబెట్టిన విశాఖ లో స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంటే హరిబాబు ఎందుకు స్పందించడని నారాయణ నిలదీశారు. నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్ పదవిని హరిబాబు తిరస్కరించాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ కోసం హరిబాబు పోరాటం చేయాలన్నారు. గతంలో విశాఖ ఉక్కు పోరాటంలో పాల్గొన్న ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని నారాయణ ప్రశ్నించారు. వెంకయ్య అప్పటి పోరాటం గుర్తు చేసుకోవాలన్నారు.
Recommended Video
మోడీ దగ్గర సాయిరెడ్డికి పలుకుబడి
వైసీపీ ప్రభుత్వానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలన్న చిత్తశుద్ధి లేదని సీపీఐ నారాయణ విమర్శించారు. విశాఖ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా నారాయణ టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉందని, ఆయన తల్చుకుంటే సమస్య పరిష్కరించగలరని నారాయణ అన్నారు. కానీ సాయిరెడ్డి ఆ పని చేయడం లేదన్నారు. వైసీపీ ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపొచ్చన్నారు.