రుషికొండ టెంకాయ మీద పిలకలా ఉంది-రేప్ కన్నా ఘోరం..సీపీఐ నారాయణ కామెంట్స్
విశాఖలో వివాదాస్పదంగా మారిన రుషికొండ తవ్వకాల ప్రాంతాన్ని ఇవాళ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సందర్శించారు. హైకోర్టు అనుమతితో ఆయన ఇవాళ రుషికొండకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విశాఖతో పాటు రుషికొండ జంక్షన్ లో పోలీసులు భారీగా మోహరించారు. రుషికొండ మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది.
రుషికొండ వెళ్లిన సీపీఐ నారాయణ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్20న తనకు రుషికొండ పర్యటనకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా పోలీసులకు తనను పంపించడానికి మూడునెలలు సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే గానీ తనకు హైకోర్టు అనుమతి రాలేదన్నారు. రుషికొండలో ఇప్పటికే 50శాతం పని పూర్తయిందని, ఇంకా 50 శాతం అవ్వాల్సి ఉందన్నారు.
రుషికొండలో తవ్వకాలపై స్పందించిన నారాయణ... సహజ సిద్ధమైన రుషికొండ కొండ మళ్ళీ వస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికొట్లు పెట్టిన మళ్ళీ అలాంటి ఒరిజినలిటి వస్తుందా అన్నారు. ప్రస్తుతం టెంకాయ మీద పిలక మాదిరిగా ఋషికొండ మారిందన్నారు. రేప్ చేస్తే ఎంత ఘోరమో దానికన్నా ఘోరంగా వైసీపీ నేతలు ప్రకృతిని రేప్ చేశారని రుషికొండ తవ్వకాలను ఉద్దేశించి నారాయణ వ్యాఖ్యానించారు. ఆ పాపం ఎప్పటికైనా వైఎస్సార్సీపీ నాయకులకు తగులుతుందన్నారు.
కొండపై జరుగుతున్న నిర్మాణానికి ఇంతవరకు ఎందుకు రహస్యంగా ఉంచారని నారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా బయట బయట నుంచి పరిశీలించి వెళ్ళారన్నారు. మీరు గోప్యంగా ఉంచడం వల్లనే ఎన్నో రహస్యాలు బట్టబయలు అయ్యాయని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నారాయణ తెలిపారు. నిర్మాణం కట్టడం నిజమే కానీ కొండని తవ్వడం సరైనది కాదన్నారు. మొత్తం 50 ఎకరాల్లో డార్మెటరీ రూమ్స్ తో పాటు అనేక రకాలుగా నిర్మాణాలు చేపట్టారన్నారు. చుట్టు పక్క ప్రాంతాలు వాటర్ పొల్యూషన్ అయిన వైఎస్సార్సీపీ వాళ్లకు ఏం పట్టదన్నారు. కోర్టులో వేశాక తమకు పర్మిషన్ వచ్చాకే నిర్మిస్తున్నాం అని చెప్తున్నారని నారాయణ తెలిపారు. మిడి మిడి జ్ఞానంతో మంత్రులు అనేక రకాలుగా మాట్లాడబట్టే ఇలా ఆ ప్రాంతం సమస్యలతో ఇలా తయారైందన్నారు.