టార్గెట్ 2019: ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాం, పవన్తో కలిసి పోటీ చేస్తాం
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిపిఐ రెడీ అవుతోంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై జనసేనతో కలిసి సిపిఐ కలిసి పనిచేస్తోంది. రానున్న రోజుల్లో ఇతర పార్టీలు కూడ జనసేనతో కలిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Recommended Video

2014 ఎన్నికల సమయంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, బిజెపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. ఈ రెండు పార్టీల కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. బావసారూప్యత గల పార్టీలు పవన్ కళ్యాణ్తో జత కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

జనసేనతో కలిసి పోటీ చేసే యోచనలో సిపిఐ
2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ ప్రకటించారు. గుంటూరులో మంగళవారం సిపిఐ జిల్లా మహసభల్లో పాల్గొన్న సందర్భంగా రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కూడా తమ ఆలోచనా విధానంలోనే నడుస్తున్నారని, ఆయనతో కలిసి ముందుకువెళ్లాలని యోచిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర మహసభల్లో నిర్ణయం
కడపలో నిర్వహించే సిపిఐ రాష్ట్ర మహసభల్లో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకొంటామని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా అజెండాతో ముందుకొచ్చే వారితోనే తమ పయనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అయితే ఎవరితో కలిసి ముందుకువెళ్లాలన్న విషయంలో ఇప్పటి వరకైతే స్పష్టత లేదన్నారు. అయితే రాష్ట్ర మహసభల్లో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా రామకృష్ణ ప్రకటించారు.

ఏపీలో మారనున్న రాజకీయ సమీకరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ప్రత్యేక హోదా విషయం మరోసారి తెరమీదికి వచ్చింది. కేంద్ర బడ్జెట్లో ఏపికి నిధుల కేటాయింపు విషయమై అన్ని పార్టీలు బిజెపి తీరుపై మండిపడుతున్నాయి. దీంతో ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చింది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేస్తే న్యాయం జరుగుతోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఈ అంశం మరోసారి ప్రచారాస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే గత ఎన్నికల నాటికి వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు నెలకొన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి ఉంటుంది, ఏ కూటమికి, ఏ కూటమికి మధ్య పోటీ ఉంటుందనే విషయమై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత
మార్చి 5వ, తేది నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్లో కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి నిధుల విషయంలో స్పష్టత రాకపోతే రాజకీయ సమీకరణాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications