'ఏపీలో 500కోట్ల కుంభకోణం.. స్కాం వెనుక మంత్రుల హస్తం'
విజయవాడ : గత మే నెలలో వెలుగుచూసిన మెడికల్ సీట్ల కుంభకోణంపై తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం, అలాగే ఆర్టికల్ 371-డీ మేరకు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారానే సీట్ల భర్తీ చేపట్టాల్సి ఉన్నా.. అధికారులు, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు చేతులు కలిపి కౌన్సిలింగ్ ను ఏకపక్షంగా పూర్తి చేశాయని లేఖలో ఆయన ఆరోపించారు.
ఏపీలో నయా కుంభకోణం.. మెడికల్ సీట్ల దందా..
మెడికల్ సీట్లలో 350 సీట్లు మినహా మిగతా సీట్లన్నింటిని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తమకు నచ్చిన రీతిలో అమ్మేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 500కోట్ల మేర జరిగిన ఈ కుంభకోణంలో 'ఏపీ మంత్రుల హస్తం కూడా ఉందని' లేఖలో ఆయన ఆరోపించారు. తిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కాలేజీల ప్రవేశాల్లో జరిగిన అక్రమాలపై కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఓపెన్ కేటగిరిలో సీట్లు వచ్చిన రిజర్వేషన్ విద్యార్థులకు రిజర్వ్డ్ కేటగిరీలోనే సీట్లు కేటాయించారని తప్పును ఎత్తి చూపారు. మొత్తం కుంభకోణం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలో సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు రామకృష్ణ. కాగా, రమణ అనే ఓ వ్యక్తి గత మే నెలలో ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన వివరాలతో.. ఈ కుంభకోణం గుట్టు రట్టయింది.