ఆ 350 కోట్లతో రాజధానిలో ఇవే నిర్మించాలి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం
అమరావతి: ఇటీవల కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధుల కింద రూ. 1000 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అందులో రూ. 350 కోట్లను నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి వెచ్చించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ రూ. 350 కోట్లను ఏపీ ప్రభుత్వం వీటిని నిర్మించనుంది.
ఈ నిధులతో గవర్నర్ నివాసమైన రాజ్ భవన్, హైకోర్టు, మంత్రుల కార్యాలయాలతో కూడిన సెక్రటేరియేట్, అసెంబ్లీ, శాసన మండలి తదితర ప్రధానమైన ప్రాధమిక మౌలిక వసతులను నిర్మించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,403 కోట్లను ఇచ్చామని కేంద్రం తెలిపింది.
ఇక, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతల మీదగా అక్టోబర్ 22న దసరా రోజున రాజధానికి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే.
రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని అంగీకరించడంతో పాటు, సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా హాజరుకానున్నారు. తుళ్లూరు మండలానికి ఈశాన్య ప్రాంతంలో మందడం-వెంకటపాలెం గ్రామల మధ్యలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని తెలిసింది.
చంద్రబాబుపై నిరుద్యోగులు నమ్మకం పెట్టుకోవద్దు: రామకృష్ణ
ఏపీ సీఎం చంద్రబాబు ఏ ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయరని, పూర్తిగా ప్రైవేట్ రంగంవైపే మొగ్గు చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిరుద్యోగులకు సూచించారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్లోని గ్రంథాలయంలో డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై నిరుద్యోగులు నమ్మకం పెట్టుకోవద్దని, పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకుందామన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ నుంచి శంకుస్థాపన కార్యక్రమం వరకు అన్నీ ప్రైవేట్ పరం చేశారన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసమే రూ.100 కోట్ల పనులను ఈవెంట్ మేనేజర్లకు అప్పగించారన్నారు.