తప్పును ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్పై లేస్తారా!: రామకృష్ణ, ఫ్యాన్స్ హ్యాపీ
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎంపీలను ప్రత్యేక హోదా పైన ప్రశ్నించిన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పైన విమర్శలు గుప్పించింది. తాజాగా, సిపీఐ నేత రామకృష్ణ కూడా అదే విధంగా స్పందించారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే అతని పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు దాడికి దిగడం సరికాదని రామకృష్ణ అన్నారు. ప్ర్తత్యేక హోదాను సాధించి చూపించాలని సూచించారు. లేదంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా పైన నిలదీసినందుకు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్తూరు నాయుడు, వెంకయ్య నాయుడులను ప్రత్యేక హోదా పైన నిలదీయాలని ఆయన తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు.
ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమతో కలిసి పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేసినా, చేయకపోయినా ప్రజలకు వచ్చిన నష్టమేమీ ఉండదని ఆయన చెప్పారు. రాజకీయ, స్వప్రయోజనాల కోసమే కెసిఆర్, చంద్రబాబు సెక్షన్ 8పై రాద్దాంతం చేస్తున్నారన్నారు.