'సంతలో గొర్రెల మాదిరి కొంటున్నారు': 'టీడీపీని ఓ ప్రైవేట్ కంపెనీ'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతలో గొర్రెలను కొన్నట్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు. బుధవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం ఆయన ప్రయత్నించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
జూన్ 2వ తేదీన చంద్రబాబు చేపట్టిన నవనిర్మాణ దీక్షను వ్యతిరేకిస్తున్నామని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆయన నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తీరుపై అన్ని పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీని చంద్రబాబు ప్రైవేట్ కంపెనీగా మార్చారు
ఎన్టీఆర్ ఓ ఆశయంతో టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు దానిని ప్రైవేట్ కంపెనీగా మార్చారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కార్పోరేట్ సంస్ధల అధినేతలకు చంద్రబాబు రాజ్యసభ సీట్లను కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు.
డబ్బున్నోళ్లకే చంద్రబాబు రాజ్యసభ సీట్లను కేటాయించారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా, నిధుల విషయంలో నిన్నటి వరకు టీడీబీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారని, కానీ ఇప్పుడు పదవులు పంచుకుంటున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications