దమ్ముంటే శ్వేతపత్రం ఇవ్వండి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ రావాలి.. : సీపీఎం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆకాంక్షించారు.
హైదరాబాద్: ప్రత్యేక హోదా గళాన్ని గట్టిగా వినిపిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఎలాంటి పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందన్న రాఘవులు.. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఉమ్మడి పోరాటాలు వస్తాయని చెప్పారు. దేశంలోని నల్లధనంపై కేంద్రం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తూ.. కేవలం నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకే ఆ నిర్ణయం తీసుకుందన్నారు రాఘవులు. క్యాష్ లెస్ వైపు జనాలను మళ్లించాలని ప్రభుత్వం చూస్తోందని.. అసలు మన దగ్గర అంత టెక్నాలజీ ఉందా? అని రాఘవులు ప్రశ్నించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
హోదా ఉద్యమాన్ని ప్రభుత్వం సహించట్లేదు: సీపీఎం మధు
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతుందని, ఉద్యమాన్ని అణిచివేయడానికి విద్యార్థులు, ఉద్యమకారులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశ్రామిక సదస్సు బోగస్ అని మధు విమర్శించారు. దమ్ముంటే ఏపీకి వస్తున్న పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
సుజనా చౌదరి చేసిన పందుల వ్యాఖ్యలను ఈ సందర్బంగా మధు ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అనాగరికమన్నారు. హోదా సాధించుకునేవరకు అందరూ కలిసి పోరాడదామని చెప్పారు.