అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక నుంచి....!!
ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. లాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు మరింత ప్రయోజనం కల్పించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పలు ఆర్దిక ప్రయోజనాలకు ఆమోదం తెలిపింది. నిర్మాణాల పైన సమీక్ష చేసింది. భూ సమీకరణకు ముందుకు వచ్చిన రైతులకు రుణ మాఫీ పైన కటాఫ్ డేట్ ఖరారు చేసారు. రైతులకు కౌలుతో పాటుగా పునరావాసం పైనా నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో భూసమీకరణ రెండో దశలో కొత్తగా ల్యాండ్ పూలింగ్ జరిగే గ్రామాల్లోని రైతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూసమీకరణ కింద భూములు ఇచ్చే ఆయా రైతులు ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. 2024 జూన్ నుంచి భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు ఏటా రూ.40 వేలు కౌలుగా చెల్లించనున్నారు. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి ఏటా రూ.10 వేల చొప్పున పదేళ్లపాటు చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ మీటింగ్ లో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసారు. అమరావతి పరిధిలోని ఈనాం భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు రూ.159 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు కూడా సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.

రుణ మాఫీ రూ 1.50 లక్ష వరకు అమలు
కాగా, ల్యాండ్ పూలింగ్ కు సహకరించిన రైతులకు పెరిగిన వార్షిక కౌలు, కొత్తగా పూలింగ్లో పాల్గొనే వారికి రుణమాఫీ, గ్రామకంఠాల్లో భూములు కోల్పోయే వారికి మెరుగైన పునరావాసం, టౌన్షి్పలలో అంతర్జాతీయ పాఠశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు వంటి అంశాలకు ఆమోదం లభించింది. రైతు లకు ఎకరానికి రూ.40వేల వరకు యాన్యుటీ అందించాలని నిర్ణయించారు. భూములు అప్పగించిన తేదీ నుంచి పదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. జరీబు భూములకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.5వేల చొప్పున, మెట్టభూములకు రూ.3వేల చొప్పున వార్షిక కౌలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
గ్రామకంఠాల్లో భూములు కోల్పోయే కుటుంబాలకు అదే గ్రామంలో సమాన విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తారు. అదే సమయంలో భూసమీకరణకు స్వచ్ఛందంగా ముందుకు రాని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం రాత్రిలోగా భూములు ఇవ్వని వారి నుంచి మరుసటి రోజు నుంచే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications